గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలి..
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
నవతెలంగాణ – భూపాలపల్లి: క్రీడలతోనే యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఆదివారం భూపాలపల్లి పట్టణంలోని కృష్ణ కాలనీ అంబేద్కర్ స్టేడియంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-19 క్రికెట్ క్రీడా పోటీలకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్యఅతిథిగా హాజరై క్రికెట్ క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వానికి దోహద పడతాయని, క్రీడలతో యువతకు ఎంతో భవిష్యత్తు ఉందని తెలిపారు. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలని, గ్రామీణ క్రికెటర్లనీ వెలుగులోకి తీసుకు వచ్చేందుకు ఆరు అంతర్ జిల్లాల అండర్- 19 క్రికెట్ పోటీలను ప్రారంభించడం జరిగిందన్నారు. కాగా నేటి నుండి హన్మకొండ, వరంగల్, జనగామ, మహబూబాద్ జట్లు ఈ టోర్నమెంట్ లో పాల్గొనను ఉన్నాయని తెలిపారు. క్రీడాకారుల సంక్షేమంకై ఈ ప్రభుత్వం ఎన్నో నూతన పథకాలు ప్రవేశ పెడుతుందని, యువత దినచ ర్యలో ఏదో ఒక క్రీడనీ అలవాటు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కార్యదర్శి చాగంటి శ్రీనివాస్, భూపాలపల్లి జిల్లా కార్యదర్శి సిరిమల్లె శ్రీనివాస్, అధ్యక్షుడు బట్టు కరుణాకర్, రాజు కుమార్,
మాజీ కౌన్సిలర్లు దాట్ల శ్రీనివాస్, ముంజాల రవీందర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు పిప్పాల రాజేందర్, తోట రంజిత్ తదితరులు పాల్గొన్నారు.