నవతెలంగాణ – హైదరాబాద్: తమిళనాడు రాజకీయాల్లో ప్రముఖ సినీ నటుడు దళపతి విజయ్ తన తన జోరు పెంచారు. రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఆయన స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ కీలక ప్రకటన చేసింది. పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన విజయ్ను ఎన్నుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పార్టీ కార్యనిర్వాహక మండలి సమావేశమై ఏకగ్రీవంగా తీర్మానించినట్లు వెల్లడించింది.
ఇటీవలే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్, టీవీకే పార్టీని స్థాపించి తొలి మహానాడు ద్వారా తన సిద్ధాంతాలను, ఆశయాలను ప్రజల ముందుంచారు. 2026 ఎన్నికల్లో తమ పార్టీదే గెలుపని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని గతంలోనే స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా విజయ్ గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాజకీయాలు సినిమాల్లా కాదని, ఇది చాలా సీరియస్ వ్యవహారమని ఆయన అన్నారు. తనకు రాజకీయ అనుభవం లేకపోయినా, భయపడి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రజల సంక్షేమం కోసమే తన సినీ జీవితాన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానని, వారి కోసమే తన పోరాటం ఉంటుందని విజయ్ స్పష్టం చేశారు. తాజా ప్రకటనతో తమిళనాడు రాజకీయాల్లో విజయ్ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నారు.