తెలంగాణ రైతు సంఘం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఈనెల 31న యాదాద్రిభువనగిరి జిల్లా రామన్నపేటలో ‘మహిళా రైతుల రాష్ట్ర సదస్సు’ నిర్వహిస్తున్నామని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పోతినేని సుదర్శన్రావు, టి.సాగర్, కేంద్ర కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి చెప్పారు. సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో సదస్సుకు సంబంధించిన పోస్టర్ను నాయకులు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్రంగా చర్చించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరుగుతున్నకొద్ది పురుషుల సంఖ్య తగ్గి మహిళల సంఖ్య పెరుగుతున్నదని తెలిపారు. వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వడంలో ప్రభుత్వాలు తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నాయని విమర్శించారు. మహిళలకు భూమిపై ఎలాంటి హక్కులు లేవని చెప్పారు. వారికి జాయింట్ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెట్టుబడి సహాయం అందకపోవడంతో మహిళా రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కౌలు రైతుల్లో కూడా మహిళలు గణనీయంగా ఉన్నారనీ, వీరికి పెట్టుబడి కోసం జాయింట్ లయబుల్ గ్రూపులను ఏర్పాటు చేసి, వాటి ద్వారా రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు ఆత్మహత్యల్లో మహిళా రైతుల ఆత్మహత్యలు కూడా గణనీయంగా నమోదు అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ కుటుంబ యజమానులు చనిపోతే ఆ భారమంతా మహిళలే మోస్తున్నారని తెలిపారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ అరిబండి ప్రసాదరావు, పెసరగాయల జంగారెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ తదితలులు ఉన్నారు.
31న రామన్నపేటలో ‘మహిళా రైతుల రాష్ట్ర సదస్సు’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



