Tuesday, August 19, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలురాష్ట్ర కాంగ్రెస్‌ అసమర్థపాలన

రాష్ట్ర కాంగ్రెస్‌ అసమర్థపాలన

- Advertisement -

గుజరాత్‌కు తరలిన రూ2,800 కోట్ల పెట్టుబడులు
రెండు వేల ఉద్యోగాలకు
గండికొట్టిన కాంగ్రెస్‌ సర్కార్‌
నిర్లక్ష్యం వీడకుంటే మరిన్ని పరిశ్రమలు తరలిపోయే ప్రమాదం: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వ అసమర్థతతో తెలంగాణ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. సీఎం రేవంత్‌ రెడ్డి చేతకాని పాలనతో గుజరాత్‌కు రూ.2,800 కోట్ల ‘కేన్స్‌’ పెట్టుబడి గుజరాత్‌కు వెళ్లిపోయిందని ఆరోపించారు. దీంతో రేవంత్‌ సర్కార్‌ తెలంగాణ యువతకు చెందిన ప్రత్యక్షంగా 2 వేల ఉద్యోగాలకు గండి కొట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీకి ఏటీఎంలా రాష్ట్రాన్ని వాడుకుంటున్న కాంగ్రెస్‌ గత బీఆర్‌ఎస్‌ శ్రమను బూడిదలో పోసిన పన్నీరుగా మారుస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

పరిశ్రమలు తరలిపోతున్నా సీఎం రేవంత్‌ రెడ్డిలో చలనం కనిపించడం లేదని కేటీఆర్‌ విమర్శంచారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ శ్రమతో కర్నాటకకు వెళ్లాల్సిన కేన్స్‌ పరిశ్రమను తెలంగాణకు రప్పించిందని తెలిపారు. ఆ పరిశ్రమకు 10 రోజుల్లోనే కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్‌ పక్కనే భూములు కేటాయించినట్టు గుర్తుచేశారు. బీఆర్‌ఎస్‌ పారదర్శక పాలన, చిత్తశుద్ధితో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన ఆ సంస్థ కాంగ్రెస్‌ అవినీతి కారణంగానే రాష్ట్రం విడిచి వెళ్లిపోయిందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఆటో పైలెట్‌ మోడ్‌లో ఉందన్న సీఎం రేవంత్‌ రెడ్డి కేన్స్‌ తరలింపుపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డి సీఎం అయ్యాక తెలంగాణ స్వయం విధ్వంసక మోడ్‌లోకి వెళ్లిందని ఆరోపించారు. తాము తెచ్చిన బ్రాండ్‌ హైదరాబాద్‌, బ్రాండ్‌ తెలంగాణ ఇమేజ్‌ను నిలబెట్టుకోలేదనీ, కమిషన్ల మీదే తప్ప పరిశ్రమలను కాపాడుకోవడం, కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి శ్రద్ధ లేదని తప్పుపట్టారు.

రాష్ట్రాభివృద్ధి, ఉద్యోగాల కల్పన గాలికొదిలేసిన రేవంత్‌ రెడ్డి తన సీఎం పదవి కాపాడుకోవడానికి ఢిల్లీ పెద్దలకు తెలంగాణను తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్‌-ఐపాస్‌ వంటి విప్లవాత్మక విధానాలతో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రపంచస్థాయి కంపెనీలను ఆకర్షించిందని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ పాలనలో కేన్స్‌ టెక్నాలజీ సంస్థ గుజరాత్‌కు తరలిపోవడం ఒక హెచ్చరిక మాత్రమేననీ, ఇప్పటికైనా రేవంత్‌ సర్కార్‌ కళ్లు తెరవకపోతే మరిన్ని సంస్థలు తరలిపోయే ప్రమాదముందని హెచ్చరించారు. పారిశ్రామిక ప్రగతిపై దృష్టి సారించాలని సూచించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad