- జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
- లబ్ధిదారులకు పథకాలు పంపిణీ
- అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
- నవతెలంగాణ – సిరిసిల్ల
- తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను జిల్లా పోలీస్ భవన్ సమీపంలోని
- పరేడ్ గ్రౌండ్ లో సోమవారం నిర్వహించగా, ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ముందుగా సిరిసిల్లలోని పాత బస్ స్టాండ్ సమీపంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే తదితరులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా తన సందేశాన్ని వినిపించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. జిల్లాలోని 110 స్వశక్తి సంఘాలకు 102 కోట్ల 45 లక్షల బ్యాంక్ లింకేజీ రుణాలను పంపిణీ చేశారు. ప్రొఫెసర్ జయ శంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆద్వర్యంలో ప్రతి గ్రామానికి నాణ్యమైన విధానం – రైతన్నకు నేస్తం( యథా బీజం – తథా సస్యం) పేరిట వానాకాలం 2025లో నాణ్యమైన వితనాలను పలువురు రైతులకు అందజేశారు. టీ ప్రైడ్ పథకం కింద 42 మంది ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు 1 కోటి 85 లక్షల సబ్సిడీ మంజూరు పత్రాలు పంపిణీ చేశారు.
- రవాణా శాఖ, ఆర్టీసీ ఆద్వర్యంలో శకటాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల ఆద్వర్యంలో అందించే సేవలు, పధకాలపై వివరించారు. అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ
- తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నేటితో 11 ఏండ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాభి నందనలు. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసువులు బాసిన అమర వీరులందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. ఎందరో అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈ రోజు అన్ని రంగాల్లో దశ దిశలా వెలుగులు విరజిమ్ముతుంది. దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నందుకు గర్వపడుతున్నాము. ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా, పారదర్శకత, జవాబుదారితనంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని అన్నారు.అభివృద్ది,సంక్షేమం సమపాళ్లలో రంగరించి జోడు గుర్రాల తరహాలో సుపరిపాలనా రథాన్ని పరుగులు పెట్టించడంలో సఫలీకృతమవుతున్నామని, ప్రజా ప్రభుత్వం ద్వారా జిల్లాలో పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ఆయన అన్నారు.
నేతన్నకు భరోసా …. సిరిసిల్లలోని నేతన్నలకు చేతి నిండా పనితో భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 64 లక్షలకు పైగా ఉన్న ఎస్ హెచ్ జీ సభ్యులకు ఏడాదికి ఉచితంగా రెండు ఏకరూప చీరల కోసం 4 కోట్ల 30 లక్షల మీటర్ల వస్త్ర ఉత్పత్తి ఆర్డర్ సిరిసిల్ల మరమగ్గాలకు కేటాయించడం జరిగినది. దీని ద్వారా జిల్లాలోని మరమగ్గాల ఆసాములు, కార్మికులు, అనుబంధ కార్మికులకు 8 నుంచి 10 నెలల వరకు ఉపాధి దొరుకుతుంది. సమగ్ర శిక్ష, వివిధ శాఖలకు 2025-26కు అవసరమైన స్కూల్ యూనిఫారం ఆర్డర్ల ను మరమగ్గాల మ్యాక్స్ సంఘాలకు 103 లక్షల మీటర్ల వస్త్ర ఉత్పత్తి ఆర్డర్ ను కేటాయించడం జరిగినది. నేతన్న పొదుపు పథకం కింద జిల్లాలోని 212 చేనేత, అనుబంధ కార్మికులు నమోదు చేయడం జరిగినది. మరమగ్గాల ఆసాములు, కార్మికులకు లబ్ది చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వం వేములవాడలో రూ. 50 కోట్ల కార్పస్ ఫండ్ తో గౌరవ ముఖ్యమంత్రితో యారన్ డిపోను ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది. 4 వేల 111 మంది మరమగ్గాల కార్మికులకు 10% యారన్ సబ్సిడీ కింద రూ. 6 కోట్ల 91 లక్షలను విడుదల చేయడం జరిగినది.
రాజన్న ఆలయ అభివృద్దికి శ్రీకారం…. రాజన్న భక్తులకు సులువైన దర్శనం.. వసతి కల్పించేందుకు భారీగా నిధులు మంజూరు చేసి, శృంగేరి పీఠాధిపతులు, వాస్తు ఇతర పండితులు, వేములవాడ వాసులు, ప్రముఖుల సూచనలు, సలహాల మేరకు వేములవాడ ఆలయ విస్తరణ పనులకు కార్యాచరణ సిద్దం చేస్తున్నది. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి 2024-25 బడ్జెట్లో రూ. 50 కోట్లు, 2025-26 బడ్జెట్ లో రూ. 100 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఆలయ అభివృద్ధి పనులకు గౌరవ సీఎం, ఇతర మంత్రులు భూమి పూజ చేశారు. విస్తరణ పనులకు శ్రీకారం చుట్టాము. రూ. 35 కోట్ల 25 లక్షల అంచనాలతో అన్నదాన సత్రం నిర్మాణానికి భూమి పూజ చేశాము. శ్రీ బద్దిపోచమ్మ ఆలయ విస్తరణ పనులు శరవేగంగా కొనసాగు తున్నాయి. గోశాలలో కోడెలను సంరక్షించేందుకు అన్ని వసతులతో గోశాలలను ఆధునీకరించడం జరుగుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వివరించారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూప, వేములవాడ సిరిసిల్ల ఆర్డీవోలు రాధాబాయి, వెంకటేశ్వర్లు, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, డిఎస్పి చంద్రశేఖర్ రెడ్డి,సిరిసిల్ల తహసిల్దార్ మహేష్ కుమార్ మున్సిపల్ కమిషనర్లు వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.