- నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలి
- తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్రావు
- మెదక్ జిల్లా చేగుంట మండలం చిట్టోజిపల్లి ముంపు ప్రాంతాల్లో పర్యటన
నవతెలంగాణ-చేగుంట
భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్రావు అన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం చిట్టోజిపల్లి గ్రామాన్ని ఆయన సందర్శించి బాధితులను పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.50 వేల చొప్పున 500 ఎకరాలకు అందించాలని డిమాండ్ చేశారు. చెరువులు, కుంటలు తెగిపోయినా పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు అక్కడ ధర్నా చేసి కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్తేగానీ స్పందించకపోవడం దురదృష్టక రమన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓలో చనిపోయిన మనుషులకు, మూగజీవాలకు నష్టపరిహారం అందజేస్తామని ప్రకటన చేశారు కానీ పంట నష్టం గురించి లేదని తెలిపారు. గతంలో ఎకరాకు మూడు వేల రూపాయలు ఇస్తామని చేస్తే రైతు సంఘంగా రూ. 10 వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేయగా, అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో తీసుకొచ్చిందని గుర్తుచేశారు. జిల్లా యంత్రాంగం పర్యటించి జిల్లాలో పూర్తి స్థాయిలో నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాలు పంటనష్టం జరిగినా ఎక్కడా ఒక్క రైతుకు కూడా ఒక్క రూపాయి ప్రభుత్వం నుంచి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పక్షాన నిలబడతామని, రైతులను ఆదుకుంటున్నామని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదన్నారు. రైతులకు యూరియా ఇవ్వడం లేదని, పంట నష్టం జరిగితే ఇప్పటివరకు పర్యవేక్షణ లేదని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల నిర్లక్ష్యాన్ని వీడాలని, రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శోభన్ నాయక్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ.మల్లేశం, రైతు సంఘం జిల్లా కార్యదర్శి లక్ష్మీ నరసయ్య, చేగుంట మండలం అధ్యక్ష కార్యదర్శులు దివాకర్, భాస్కర్, గ్రామ కమిటీ అధ్యక్షులు రమేష్, రాంపూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు స్వామి, అశోక్, సాయి కుమార్, సత్యనారాయణ, నల్ల పోచయ్య రైతులు, తదితరులు పాల్గొన్నారు.