Sunday, June 8, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమంత్రి ఉత్తమ్‌..ఇకనైనా తప్పుడు ప్రచారం మానుకో

మంత్రి ఉత్తమ్‌..ఇకనైనా తప్పుడు ప్రచారం మానుకో

- Advertisement -

బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌ ఆగ్రహం

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి చేస్తున్నది దుష్ప్రచారమని పూర్తి ఆధారాలతో బట్టబయలు చేసినా.. మళ్లీ అవే అబద్దాలు చెప్తున్నారని బీఆర్‌ఎస్‌ నేత, మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. పూర్తి ఆధారాలతో సహా ప్రజెంటేషన్‌లో అన్ని వాస్తవాలూ చెప్పానని అన్నారు. ఐదేండ్లలో మేడిగడ్డలో ఎత్తిపోసిన నీళ్లు 162 టీఎంసీలేనని చెప్పారు. కాళేశ్వరంలో భాగమైన ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేర్‌కు లిఫ్ట్‌ చేసింది ఎందుకు చెప్పరని ప్రశ్నించారు. లక్ష్మీ పంప్‌ హౌజ్‌, సరస్వతి పంప్‌హౌజ్‌, పార్వతి పంప్‌హౌజ్‌, నంది పంప్‌హౌజ్‌, గాయత్రి పంప్‌హౌజ్‌ నుంచి ఎత్తిపోసిన నీళ్ల గురించి ఎందుకు దాస్తారని అడిగారు. కాళేశ్వరం కట్టిన మూడేండ్లలోనే.. అంటే, 2022-23 వరకే మేడిగడ్డ నుంచి 162.41 టీఎంసీ, అన్నారం నుంచి 172.86 టీఎంసీ, సుందిళ్ల నుంచి 172.12 టీఎంసీ, నంది మేడారం పంప్‌ హౌజ్‌ నుంచి 181.70 టీఎంసీ, గాయత్రి పంప్‌ హౌజ్‌ నుంచి 179.41 టీఎంసీల గోదావరి జలాలను కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తి పోశామనీ, ఇది వాస్తవం కాదా? అని హరీశ్‌ అన్నారు. మీకు తెలియకుంటే మీ ఇంజినీర్లను అడిగి వివరాలు తెలుసుకోవాలని హితవు పలికారు. ఇరిగేషన్‌ మంత్రిగా ఉంటూ ఎందుకు గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. ఏ ప్రాజెక్టు నిర్మించినా మొదటి దశలోనే పూర్తి ఆయకట్టుకు నీరు అందించడం సాధ్యపడదనే విషయం అందరికీ తెలిసిందేనని వివరించారు. కాల్వలు తవ్వుతున్నా కొద్దీ నీరు అందే ఆయకట్టు పెరుగుతుందన్నారు. తొమ్మిది లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా 1963లో ప్రారంభించిన ఎస్సారెస్పీ పనులు 1975 నాటికి పూర్తి కాగా, 11 ఏండ్ల తర్వాత మొదటగా వచ్చిన ఆయకట్టు 25వేల ఎకరాలు మాత్రమేనని చెప్పారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు 1955లో శంకుస్థాపన చేస్తే 1966లో పూర్తి చేశారని వివరించారు. 12 ఏండ్ల తర్వాత ఎడమ కాల్వ ద్వారా 5లక్షల ఎకరాల లక్ష్యానికి గాను మొదట్లో వచ్చిన ఆయకట్టు 98,842 ఎకరాలు మాత్రమేనని తెలిపారు. కాంగ్రెస్‌, టీడీపీలు కట్టిన కల్వకుర్తి ప్రాజెక్టు 1984లో ప్రారంభమై 2014 నాటికి మీరిచ్చిన ఆయకట్టు 3లక్షల 30వేల ఎకరాలకుగాను మొదట్లో ఇచ్చింది 13వేల ఎకరాలు మాత్రమేనని చెప్పారు. 2001లో మొదలు పెట్టిన దేవాదుల ప్రాజెక్టు ద్వారా 2014 నాటికి ఆరు లక్షల ఎకరాలకు గాను మీరిచ్చింది 45వేల ఎకరాలు మాత్రమేనన్నారు. ఏ ప్రాజెక్టు చూసినా ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పారు. ఏ ప్రాజెక్టులోనైనా హెడ్‌ వర్క్స్‌ మొదలు పూర్తి చేసి టెయిల్‌ వర్క్స్‌ తర్వాత పూర్తి చేస్తుంటారని గుర్తు చేశారు. కానీ మీరు మాత్రం కమీషన్ల కోసం తోక పనులు మొదలు పెట్టి, హెడ్‌ వర్క్స్‌ వదిలి పెట్టారని హరీశ్‌ అన్నారు. ఆ ఘనత మీ కాంగ్రెస్‌ పార్టీకే దక్కుతుందని విమర్శించారు. ఇకకైనా తలా తోక లేని మాటలు మాట్లాడటం మానేయాలనీ, అబద్దాలు ప్రచారం చేయడం విరమించుకోవాలని సూచించారు. ఈమేరకు శనివారం ఒక ప్రకటనను ఆయన విడుదల చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -