– విపత్తు నిర్వహణ బృందాలను అందుబాటులో ఉంచండి
– మరో రెండు రోజులు భారీ వర్షాలు : అధికారులకు సీఎస్ రామకృష్ణరావు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జీహెచ్ఎంసీ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణరావు అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ నుంచి గురువారం సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో 12 సెంటీమీటర్ల వరకు వర్ష పాతం నమోదైనందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, నీరు నిలిచే ప్రాంతాల (వాటర్ లాగింగ్ పాయింట్స్)పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఐటీ కారిడార్, రాజ్ భవన్, షేక్ పేట్ ఏరియాల్లో నీటి నిలువ సమస్య వస్తున్నందున తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. నాలాల మూతలు ఎట్టి పరిస్థితుల్లో తొలగించవద్దని సూచించారు.
వర్షం పడే సమయంలో విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండకూడదని కోరారు. క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండి, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. హైడ్రాతో సమన్వయం చేసుకుంటూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 250 బృందాలు క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నట్టు ఈ సందర్భంగా సీఎస్కు అధికారులు వివరించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామనీ, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాధ్, జల మండలి ఎండి అశోక్రెడ్డి, విద్యుత్ విభాగం సీఎండీ ముష్రాఫ్ అలీ, సమాచార శాఖ స్పెషల్ కమీషనర్ ప్రియాంక, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమీషనర్లు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.