– జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ
– చౌట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మికంగా తనిఖీ
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ప్రతి గర్భిణీ స్త్రీకి ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పులు జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం మండలంలోని చౌట్ పల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా హాజరు సిబ్బంది హాజరు పట్టిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో జరుగుతున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను అదేవిధంగా ఆస్పత్రిలో జరుగుతున్న అమ్మ ఒడి కార్యక్రమాన్ని పరిశీలించారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇప్పటివరకు అయినా కాన్పుల వివరాలతో కూడిన రికార్డులను, మహిళా ఆరోగ్య కార్యక్రమాన్ని పరిశీలించారు. ఆస్పత్రికి విచ్చేసిన గర్భిణీ స్త్రీలతో మాట్లాడి వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. మహిళలకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. అనంతరం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ మాట్లాడుతూ ..ప్రతి గర్భిణీ స్త్రీ ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి వైద్య అధికారిణి డాక్టర్ స్పందనను ఆదేశించారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, ఆస్పత్రికి విచ్చేసే రోగులకు మంచి సేవలందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిణి డాక్టర్ స్పందన, ఆరోగ్య విస్తరణ అధికారి సత్యనారాయణ, ఆరోగ్య పర్యవేక్షకులు స్వరూప, పద్మ, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.



