ప్రధాని మోడీకి సీపీజే లేఖ
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పలు జైళ్లలో మగ్గుతున్న జర్నలిస్టులను విడుదల చేసే విషయంపై దృష్టి సారించాలని కోరుతూ జర్నలిస్టుల రక్షణ కమిటీ (సీపీజే ) ప్రధాని నరేంద్ర మోడీని కోరింది. ఈ మేరకు కమిటీ ఒక లేఖ రాసింది. జర్నలిస్టుల నిర్బంధాన్ని కొనసాగించడం, వారిని వేధింపులకు గురి చేయడం వల్ల ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, పేద దేశాల స్వరంగా భారతదేశానికి గల పేరు ప్రతిష్టలు తుడిచిపెట్టుకుపోతున్నాయని కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది.
బుధవారం అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా నిర్బంధంలో వున్న జర్నలిస్టులు స్వేచ్ఛను పొందేలా, వారి కుటుంబాలను కలుసుకునేలా చర్యలు తీసుకోవాలని కమిటీ, ప్రభుత్వాన్ని కోరింది. 2014 నుండి యుఎపిఎ కింద 15మంది జర్నలిస్టులపై విచారణ జరిగిందని గుర్తు చేసింది. జార్ఖండ్కు చెందిన రూపేష్ కుమార్ సింగ్ మూడేండ్లకు పైగా జైల్లో మగ్గుతున్నారని తెలిపింది. పైగా జైల్లో కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో వుండడం లేదని పేర్కొంది. ప్రభుత్వం స్పందించి వెంటనే వారి విడుదలకు చర్యలు తీసుకోవాలని కమిటీ కోరింది.
జర్నలిస్టుల విడుదలకు చర్యలు తీసుకోవాలి
- Advertisement -
- Advertisement -



