Wednesday, November 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం'సర్‌' ప్రక్రియ నిలిపివేయండి

‘సర్‌’ ప్రక్రియ నిలిపివేయండి

- Advertisement -

సుప్రీంకోర్టును
ఆశ్రయించిన కేరళ ప్రభుత్వం
తిరువనంతపురం :
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)పై కేరళ ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్రంలో సర్‌ను వాయిదా వేయాలని భారత ఎన్నికల సంఘం (ఇసిఐ)ని ఆదేశించాలని కేరళ ప్రభుత్వం కోరింది. ఎస్‌ఐఆర్‌, స్థానిక సంస్థల ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం ‘దాదాపు అసాధ్యం’ అని ప్రభుత్వం పేర్కొంది. ఈ నెల 4 నుంచి డిసెంబర్‌ 4 వరకు ‘గందరగోళ’ సర్‌ ప్రక్రియ నిర్వహణ సమయంలోనే కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని తెలిపింది. డిసెంబర్‌ 9, 11 తేదీల్లో రాష్ట్రంలోని ఎల్‌ఎస్‌జిఐలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఇసిఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ రెండూ ఒకేసారి నిర్వహించడంతో మానవ వనరులకు తీవ్ర కొరత ఏర్పడుతుందని, ఉద్యోగులు ఒత్తిడికి గురవుతారని, ప్రభుత్వ రోజు వారీ పనితీరుపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొంది. సిబ్బంది కొరత ‘పాలనా ప్రతిష్టంభన’కు కూడా దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది.

”సర్‌ అనే ఎన్నికల సంబంధిత విధుల కోసం ప్రభుత్వ, పాక్షిక ప్రభుత్వ సేవల నుండి సుమారు 1,76,000 మంది సిబ్బందిని, మరో 68 వేల మంది పోలీసులు, ఇతర భద్రతా సిబ్బందిని మోహరించాల్సి ఉంది. సర్‌ సంక్ష్లిష్టతతో కూడిన గందరగోళ ప్రక్రియ. దీనికోసం 25,668 మంది అదనపు సిబ్బంది సేవలు అవసరం. శిక్షణ పొందిన, అనుభవజ్ఞులైన ఎన్నికల సిబ్బంది పరిమితంగా ఉండటంతో వాటికి ఆటంకం ఏర్పడుతుంది. ఎస్‌ఐఆర్‌, ఎల్‌ఎస్‌జిఐ ఎన్నికల కోసం ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో అధికారుల కేటాయింపు దాదాపు అసాధ్యం, పాలనా ప్రతిష్టంభనకు దారితీస్తుంది” అని పిటిషన్‌లో పేర్కొంది. సర్‌ ప్రక్రియ ప్రజాస్వామ్యానికి అనుకూలంగా లేదని కేరళ ప్రభుత్వం తరపున పిటిషన్‌ దాఖలు చేసిన న్యాయవాది సి.కె.శశి పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్‌తో స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా నిర్వహించలేమని తెలిపారు. కేరళలో 941 గ్రామ పంచాయితీలు, 152 బ్లాక్‌ పంచాయితీలు, 14 జిల్లా పంచాయితీలు, 87 మునిసిపాలిటీలు, ఆరు కార్పొరేషన్ల తో కూడిన 1200 స్థానిక స్వపరిపాలన సంస్థలు (ఎల్‌ఎస్‌జిఐ)లు ఉన్నాయి. మొత్తం 23,612 వార్డులు ఉన్నాయి. ఆర్టికల్‌ 243-ఇ, 243-యు కింద రాజ్యాంగ ఆదేశాన్ని, కేరళ పంచాయితీరాజ్‌ చట్టంలోని సెక్షన్‌ 38, కేరళ మునిసిపాలిటీ చట్టంలోని సెక్షన్‌ 94కింద ఐదేళ్లలోపు ఎల్‌ఎస్‌జిఐలకు ఎన్నికలు నిర్వహించాలనే చట్టబద్ధమైన ఆదేశాన్ని పిటిషనర్‌ గుర్తు చేశారు. రాష్ట్రంలోని ఎల్‌ఎస్‌జిఐలకు ఓటింగ్‌, లెక్కింపు, ఫలితాల ప్రకటన సహా ఎన్నికల ప్రకటన ప్రక్రియను రాజ్యాంగ, చట్టబద్ధమైన ఆదేశాలకు అనుగుణంగా 2025 డిసెంబర్‌ 21లోపు పూర్తి చేయాలని కేరళ ప్రభుత్వం పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -