– నిమిషం ఆలస్యమైతే 5 పరుగులు పెనాల్టీ
– 2025-27 డబ్ల్యూటీసీ నుంచి అమలు
నవతెలంగాణ-దుబాయ్
స్టాప్క్లాక్ నిబంధన ఇక నుంచి అన్ని ఫార్మాట్లలోనూ అమలు కానుంది. వైట్బాల్ ఫార్మాట్లో స్లో ఓవర్రేట్ను అధిగమించేందుకు 2024, జూన్ 1 నుంచి స్టాప్క్లాక్ రూల్ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. టెస్టు క్రికెట్లోనూ స్లో ఓవర్రేట్ సమస్య పరిష్కారానికి స్టాప్క్లాక్ రూల్ను అమలు చేయనున్నారు. స్టాప్క్లాక్తో పాటు పలు ఇతర నిబంధనలను సైతం ఐసీసీ అమలు చేయనుంది. ఈ మేరకు క్రికెట్ కమిటీ చేసిన సిఫారసులను ఐసీసీ ఆమోదించింది.
ఐదు పరుగుల పెనాల్టీ
నూతన నిబంధనల ప్రకారం ప్రతి రెండు ఓవర్ల మధ్య 60 సెకండ్ల కంటే ఎక్కువ విరామం ఉండకూడదు. ఓ ఓవర్లో ఆరో బంతి పడిన తర్వాత.. మరో ఓవర్లో తొలి బంతి 60 సెకండ్ల లోపు పడాలి. లేదంటే ఫీల్డ్ అంపైర్లు తొలుత రెండు సార్లు హెచ్చరిక జారీ చేస్తారు. మూడోసారి సైతం ఇదే పునరావృతమైతే.. బ్యాటింగ్కు జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తారు. రెండు సార్ల తర్వాత, ఎన్ని సార్లు నిమిషం ఆలస్యమైతే అన్ని సార్లు 5 పరుగుల పెనాల్టీ వేస్తారు. 2025-26 ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ నుంచే ఈ నిబంధన అమలు కానుంది.
ఉమ్మి పడితే.. అంతే!
టెస్టు క్రికెట్లో బంతి స్వభావం మారినట్టు అనిపిస్తే.. ఫీల్డింగ్ జట్టు కెప్టెన్ మరో బంతి అడిగే వీలుంటుంది. బంతిపై ఉమ్మి వాడకంపై నిషేధం కొనసాగుతున్నప్పటికీ.. ఫీల్డింగ్ జట్టు బంతిపై ఉమ్మి వాడినట్టు అంపైర్ భావిస్తే ఆ జట్టుకు మరో బంతిని నిరాకరిస్తారు. బంతి స్వరూపం మార్చేందుకు ఫీల్డింగ్ జట్టు కావాలని ఉమ్మి వాడినా, సాధారణంగా మెరుపు పొగొట్టేందుకు ఉమ్మి వాడినా.. ఆ కారణంగా బంతి స్వరూపం మారితే అంపైర్లు మరో బంతిని ఇవ్వరు. ఈ విషయంలో అంపైర్ల నిర్ణయమే తుది నిర్ణయం.
నో బాల్కు క్యాచౌట్ అయితే..
నో బాల్కు క్యాచ్ పట్టినప్పుడు కొత్త నిబంధనలు అమలు చేయనున్నారు. టీవీ అంపైర్ తొలుత నో బాల్ను పరిశీలించి.. ఆ తర్వాత క్యాచ్ను ఎలా అందుకున్న విధానంపై టీవీ రీప్లేలో చూస్తారు. ఇప్పటివరకు నో బాల్కు క్యాచ్ ఫెయిర్నెస్ను పరిశీలించేవారు కాదు. కొత్త నిబంధనల ప్రకారం.. నో బాల్ అయినా.. క్యాచ్ ఫెయిర్నెస్ను బట్టి పరుగులను ఇస్తారు. క్యాచ్ను ఫెయిర్గా అందుకుంటే వికెట్ల మధ్య పరుగులను పరిగణనలోకి తీసుకోరు. క్యాచ్ ఫెయిర్గా లేకుంటే.. నో బాల్కు ఒక్క పరుగును ఇస్తరు. వికెట్ల మధ్య తీసిన పరుగులను లెక్కలోకి తీసుకోరు.
కొత్త ఆటగాడికి ట్రయల్
టెస్టు క్రికెట్లో ప్రస్తుతం కంకషన్ ప్లేయర్ నిబంధన అమల్లో ఉంది.తలకు బలమైన గాయం తగిలినప్పుడు మ్యాచ్ రిఫరీ.. అటువంటి ప్రత్యామ్నాయ ఆటగాడిని కంకషన్ ఆటగాడిగా తీసుకుంటారు. మైదానంలో ఆటగాళ్లు తీవ్ర గాయానికి గురైన సమయంలో సబ్స్టిట్యూట్ ఆటగాడి సేవలు అందుబాటులో లేవు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఆటగాడిని ఆడించేందుకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. ఈ మేరకు అన్ని దేశాల క్రికెట్ బోర్డులకు ఐసీసీ మార్గదర్శకాలు జారీ చేసింది.