Saturday, May 31, 2025
E-PAPER
Homeజాతీయంతీరం దాటిన తుపాను

తీరం దాటిన తుపాను

- Advertisement -

– పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు
– మరో 48గంటలు ఇదే పరిస్థితి
కోల్‌కతా:
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తుపానుగా మారి గురువారం పశ్చిమబెంగాల్‌-బంగ్లాదేశ్‌ మధ్య తీరం దాటింది. దీని ప్రభావం కారణంగా ముమ్మరంగా వర్షాలు కురుస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా వుంటుందని, రాబోయే నాలుగైదు రోజులు మత్స్యకారులెవరూ సముద్రంలో వేటకు వెళ్లవద్దని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ బెంగాల్‌లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోల్‌కతా నగరంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడుతున్నాయి. దీనికితోడు బలమైన గాలులు వీస్తున్నాయి. గత ఆరు గంటలుగా గంటకు 22కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతూ వచ్చిన తుపాను సాగర్‌ ఐలాండ్‌ (పశ్చిమ బెంగాల్‌), ఖెపుపారా(బంగ్లాదేశ్‌) మధ్య ఉదయం 11.30గంటల సమయంలో తీరం దాటిందని ఐఎండీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రభావం కారణంగా రాబోయే 48గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసిందని ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా వుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. ఉత్తర, దక్షిణ 24పరగణాల జిల్లాల్లో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. నదియా,ముర్షిదాబాద్‌ జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కోల్‌కతా, హౌరా, హుగ్లీ, తూర్పు, పశ్చిమ మిడ్నపూర్‌, తూర్పు బర్ధ్వాన్‌ జిల్లాల్లో కూడా ఒక మోస్తరు నుండి భారీ వర్షపాతం నమోదైందని ఐఎండి తెలిపింది. నైరుతి రుతుపవనాలు ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయని పేర్కొంది. గురువారం నాటికి మొత్తంగా సిక్కిం అంతా వ్యాపించాయి. వచ్చే ఒకటి రెండు రోజుల్లో బెంగాల్‌ అంతా విస్తరించేందుకు పరిస్థితులు సానుకూలంగా వునాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -