జిల్లా ఆధునిక కలెక్టర్ (రెవెన్యూ) ఖీమ్యా నాయక్
నవతెలంగాణ – వనపర్తి
జిల్లాలోని చిన్ననీటి వనరుల లెక్క తేల్చేందుకు నిర్వహించనున్న గణన ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖిమ్యా నాయక్ ఆదేశించారు. మంగళవారం అదనపు కలెక్టర్ రెవెన్యూ తన ఛాంబర్ లో జిల్లాలో చిన్ననీటి వనరుల గణనపై సంబంధిత శాఖల జిల్లాస్థాయి స్టీరింగ్ కమిటీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని చిన్న నీటి పారుదల వనరుల గణన ప్రణాళిక ప్రకారం పూర్తిచేయాలని ఆదేశించారు. రెండు వేల హెక్టార్లలోపు విస్తీర్ణం ఉన్న జలవనరుల గణన మొబైల్ అప్లికేషన్ ద్వారా చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని వెల్లడించారు. తహసీల్దార్, ఎంపీఎస్వో, నీటిపారుదల శాఖ ఏఈలు సూపర్వైజర్గా ఉంటారని, జీపీవో లు, పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్అసిస్టెంట్లు, ఏఈవోలు ఎన్యూమరేటర్లు గా కొనసాగుతారని తెలిపారు. జిల్లాలో ఉన్న 228 రెవెన్యూ గ్రామాల్లో చిన్న నీటి వనరుల గణన కోసం 67 మంది ఏఈవోలు, 102 మంది జి పి ఓ లు, అవసరానికి తగ్గట్టుగా పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లను కేటాయించాలన్నారు.
జిల్లాలోని అన్ని చెరువులు, కుంటలు ఇతర జల వనరుల వివరాలు సేకరించడంపై అందరూ ఎన్యూమరేటర్లకు ఆయా మండలాల స్థాయిలో త్వరతగతిన శిక్షణ పూర్తి చేయాలని ఆదేశించారు. పీపీటి ద్వారా ఎన్యూరేటర్లకు మొబైల్ అప్లికేషన్ జనన ప్రక్రియపై స్పష్టంగా శిక్షణ ఇవ్వాలని సూచించారు. నీటి పారుదల శాఖ, విద్యుత్ శాఖ ఇతర శాఖల అధికారులు తమ శాఖకు సంబంధించిన వివరాలను గణన చేస్తున్న అధికారులకు అందజేయాలని సూచించారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డిఆర్డిఓ ఉమాదేవి, డిపిఓ తరుణ్ చక్రవర్తి, సిపిఓ రవీందర్, విద్యుత్ శాఖ ఎస్ ఈ రాజశేఖర్, నీటిపారుదల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.



