– మోడీ సర్కారుపై కార్మికుల కన్నెర్ర
– సమ్మెలో పాల్గొన్న 10,20,000 మంది కార్మికులు
– లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్
– సమ్మె జయప్రదం చేసిన కార్మికులకు
– సీఐటీయూ అభినందనలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
లేబర్ కోడ్ల రద్దు కోసం, కార్మికు హక్కుల కోసం తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె తెలంగాణలో సక్సెస్ అయిందనీ, రాష్ట్రంలో సంఘటిత, అసంఘటిత రంగాలకు చెందిన 10,20,000 కార్మికులు పాల్గొన్నారని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు, ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ వెల్లడించారు. సమ్మెను జయప్రదం చేసిన ప్రతి కార్మికునికీ పేరుపేరునా అభినందనలు తెలిపారు. ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ’29 కార్మిక చట్టాలను రద్దు చేసి పెట్టుబడిదారుల ప్రయోజనాలు, వారి అధిక లాభాల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్తో పాటు రైతులు, వ్యవసాయ కూలీలు, సామాన్య ప్రజలకు వ్యతిరేకమైన నయా ఉదారవాద, మతోన్మాద – కార్పొరేట్ విధానాలను విరమించుకోవాలని, ప్రభుత్వరంగ సంస్థల్ని ప్రయివేటీకరించొద్దని కోరుతూ 20 డిమాండ్లతో తలపెట్టిన సమ్మె జయప్రదమైంది.
సంగారెడ్డి పారిశ్రామిక ప్రాంతంలో భారీ, మధ్యతరహా, చిన్నతరహా పరిశ్రమ ల్లో 72,905 మంది, మేడ్చల్ పారిశ్రామిక ప్రాంతంలో 2,810 పరిశ్రమల్లో 93,415 మంది, రంగారెడ్డి జిల్లాలో 40,000 మంది, మెదక్ జిల్లాలో 219 పరిశ్రమల్లో 17 వేల మంది, పెద్దపల్లిలో 95 వేల మంది పారిశ్రామిక కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. 9 పబ్లిక్ సెకార్లలో (సింగరేణితో సహా) పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికులు 66 వేల మంది, ఆర్టిసి ఉద్యోగులు పదివేల మంది, బ్యాంక్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ సెక్టార్లో 19 వేల మంది, పోస్టల్లో 26 వేల మంది, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 1,000 మంది, రక్షణ శాఖ ఉద్యోగులు 4,000 మంది, మెడికల్ రిప్స్ 5,200 మంది, మున్సిపల్ కార్మికులు 52,200 మంది, గ్రామ పంచాయితీ కార్మికులు 34,860 మంది పాల్గొన్నట్టు మా దృష్టికి వచ్చింది. మొత్తంగా రాష్ట్రంలో 10,20,000 మంది సమ్మెలో పాల్గొన్నారు. పారిశ్రామిక కార్మికులు పరిశ్రమలను బంద్ పెట్టి సమ్మెలో పాల్గొన్నారు.
ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు, సింగరేణి, ఫైనాన్స్ సెక్టార్, బ్యాంక్, ఇన్సూరెన్స్ ఉద్యోగులు, పోస్టల్, సెంట్రల్ గవర్నమెంట్, రక్షణ శాఖ ఉద్యోగులు, మున్సిపల్, గ్రామ పంచాయతీ, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, ఐకెపి, ఫీల్డ్ అసిస్టెంట్స్, ఆరోగ్య శాఖ, బీడీ, హమాలీ, భవన నిర్మాణం, ప్రయివేటు, ట్రాన్స్పోర్ట్ కార్మికులు లక్షలాది మంది కార్మికులు సమ్మెలో పాల్గొని మోడీ సర్కార్పై కన్నెర్రజేశారు. హైదరాబాద్లో కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వేలాది మంది కార్మికులు మహాప్రదర్శనలో కదం తొక్కారు. జిల్లా, మండల, పారిశ్రామిక ప్రాంతాల్లో పెద్దఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సమ్మెకు రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల పోరాట వేదికతో పాటు పలు సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాతంత్రవాదులు, ప్రజా, విద్యార్థి, యువజన సంఘాలు మద్దతుగా నిలిచాయి. సమ్మెలో పాల్గొన్న కార్మికవర్గానికి అభినందన లు, అండగా నిలిచిన వారందరికీ సీఐటీయూ తరఫున ధన్యవాదాలు. మునుముందు కూడా ఐక్యపోరాటాలకు అండగా నిలబడాలని కోరుతున్నాం’ అని ప్రకటనలో పేర్కొన్నారు.