న్యాయ నిపుణులతో సీఎం రేవంత్రెడ్డి చర్చలు
కేంద్రం అనుమతులివ్వకుండా ఆదేశించండి
పిటిషన్లో కోర్టును కోరిన రాష్ట్ర ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ తలపెట్టిన పోలవరం-నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్పై సుప్రీంకోర్టులో బలంగా వాదనలు వినిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్ట్ను అడ్డుకునేందుకు సీనియర్ న్యాయ నిపుణులతో చర్చలు జరిపింది. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం వేసిన రిట్ పిటిషన్ సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం ముంబైలో సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వం తరఫున సమర్థమైన వాదనలు వినిపించాలని న్యాయ నిపుణులకు సూచించారు. అవసరమైన అన్నిఆధారాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఇరిగేషన్ అధికారులను అప్రమత్తం చేశారు.
అనుమతులు లేకుండా పోలవరం నుంచి బనకచర్ల లేదా నల్లమలసాగర్ కు లింక్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న విస్తరణ పనులను పూనుకుంది. తక్షణమే పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఈ పనులు ఆపేలా సుప్రీంకోర్టు ఆదేశించాలని పలు అంశాలను ప్రస్తావించింది. మొదట్లో ఆమోదించిన మేరకు పోలవరం ప్రాజెక్ట్ పనుల స్వరూపం ఉండాలనీ, విస్తరణ పనులు చేపట్టడం చట్టబద్ధం కావని పిటిషన్లో స్పష్టం చేసింది. తెలంగాణ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా నల్లమలసాగర్ ప్రాజెక్టు ప్రీ ఫిజిబులిటీ రిపోర్టులను కేంద్ర ప్రభుత్వం పరిశీలించటం సమంజసం కాదని అభ్యంతరం తెలిపింది. అందుకు సంబంధించి కేంద్ర జల సంఘం, కేంద్ర జల మంత్రిత్వ శాఖ, గోదావరి నీటి యాజమాన్య బోర్డులకు స్పష్టమైన ఆదేశాలివ్వాలని కోరింది. కేంద్ర జల సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం డీపీఆర్ తయారీకి సిద్ధపడుతోందనీ, వెంటనే ఈ చర్యలను ఆపాలని కోరింది. ఏపీ తలపెడుతున్న ఈ విస్తరణ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా, కేంద్రం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందించకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో పేర్కొంది.



