Monday, April 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రయివేటు మెడికల్‌ కాలేజీల ఫీజుల దోపిడికి వ్యతిరేకంగా పోరాటం

ప్రయివేటు మెడికల్‌ కాలేజీల ఫీజుల దోపిడికి వ్యతిరేకంగా పోరాటం

- Advertisement -

మెడికో పేరెంట్స్‌ అసోసియేషన్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ప్రయివేటు మెడికల్‌ కాలేజీల ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని మెడికో పేరెంట్స్‌ అసోసియేషన్‌ నిర్ణయించింది. ఈ మేరకు అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు మల్లోజు సత్య నారాయణ చారి అధ్యక్షతన హైదరాబాద్‌లో సమావేశమై ఫీజుల దోపిడీపై చర్చించారు. నిబంధనల మేరకు ప్రయివేటు మెడికల్‌ కాలేజీలు బి, సి క్యాటగిరీలకు సంబంధించిన విద్యార్థుల నుంచి నాలుగున్నర సంవత్సరాల వరకు మాత్రమే ఫీజులు వసూలు చేయాల్సి ఉండగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో బి క్యాటగిరీలో ఒక్కో విద్యార్థి రూ.6 లక్షలు, సి క్యాటగిరీలో ఒక్కో విద్యార్థి రూ.13 లక్షలు చెల్లించాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మెడికల్‌ విద్యార్థుల తల్లిదండ్రుల పై అదనంగా రూ.209 కోట్ల భారాన్ని మోపుతున్నారనీ, అయితే అపోలో, మల్లారెడ్డి కాలేజీలు మాత్రం మినాహాయింపునిచ్చాయని తల్లిదండ్రులు తెలిపారు.

సమస్యల పరిష్కారం కోసం పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. పోరాటంలో ముందుగా ఎఫ్‌ఆర్‌సీని అసోసియేషన్‌ సభ్యులు కలుస్తారనీ, ఏప్రిల్‌ 15న కాళోజీ యూనివర్సిటీ సమీపంలో పెద్ద ఎత్తున సమావేశమవ్వాలనీ, తల్లిదండ్రుల తరపున వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించినట్టు సత్యనారాయణచారి వెల్లడించారు. అప్పటికీ యూనివర్సిటీ, ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలు దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయిం చనున్నట్టు తెలిపారు. అనంతరం అసోసియేషన్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెడికల్‌ కాలేజీల యాజమాన్యాలను కలిసి సమస్యలపై చర్చిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్‌ ప్రతినిధులు బీరెల్లి కమలాకర్‌, రమేష్‌, కేవీఆర్‌, రవీందర్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, సుజాత, సంధ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా ప్రతినిధులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -