న్యూఢిల్లీ : పదవ తరగతి విద్యార్థులు మొదటి బోర్డు పరీక్షలకు హాజరుకావడం తప్పనిసరని ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ)’ సోమవారం స్పష్టం చేసింది. మొదటి బోర్డు పరీక్షల్లో కనీసం మూడు సబ్జెక్టులను కూడా రాయని వారిని ‘ఎసెన్షియల్ రిపీట్’ కేటగిరీలో ఉంచుతామని అధికారులు తెలిపారు. పదవతరగతి విద్యార్థులకు 2026 నుండి రెండు బోర్డు పరీక్షలను నిర్వహిస్తామని సిబిఎస్ఇ ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని ప్రత్యేక కారణాలతో మొదటి బోర్డు పరీక్ష రాయలేని విద్యార్థులను రెండవ బోర్డు పరీక్ష రాసేందుకు అనుమతించాలంటూ వచ్చిన అభ్యర్థనలపై సిబిఎస్ఇ పై విధంగా స్పందించింది. ”మొదటి బోర్డు పరీక్షకు విద్యార్థులంతా హాజరుకావడం తప్పనిసరి. ఉత్తీర్ణులైన, అర్హత కలిగిన విద్యార్థులందరూ సైన్స్, మ్యాథ్స్, సోషల్, లాంగ్వేజెస్లోని మూడు సబ్జెక్టుల్లో దేనిలోనైనా తమ పనితీరును మెరుగుపరుచుకోవడానికి అనుమతి ఉంటుంది” అని సిబిఎస్ఇ పరీక్షల అధికారి సంయమ్ భరద్వాజ్ పేర్కొన్నారు.



