– ప్రభుత్వ ఉపాధ్యాయుడు విజయగిరి రామకృష్ణ
నవతెలంగాణ – కామారెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు భయపడకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని కామారెడ్డి మండలంలోని చిన్న మల్లారెడ్డి పాఠశాలకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు విజయగిరి రామకృష్ణ సూచించారు. ప్రశాంతమైన మనస్సుతో చదువుకొని సమయపాలనతో ప్రిపరేషన్ చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. గత ప్రశ్నాపత్రాలు, మోడల్ పేపర్లను సాధన చేయడం ద్వారా పరీక్షల్లో మెరుగైన ప్రతిభ చూపవచ్చని తెలిపారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తగినంత నిద్ర, తేలికపాటి ఆహారం తీసుకోవాలని సూచించారు.
పరీక్షా హాల్లో ప్రశ్నాపత్రాన్ని పూర్తిగా చదివి బాగా తెలిసిన ప్రశ్నలను ముందుగా రాయాలని చెప్పారు. జవాబులను అందంగా, స్పష్టంగా రాయడంతో పాటు అవసరమైన చోట డయాగ్రామ్స్ గీయాలని సూచించారు. పరీక్ష పూర్తయ్యాక గత పేపర్పై చర్చించకుండా తదుపరి పరీక్షపై దృష్టి పెట్టాలని తెలిపారు. సెల్ఫోన్లు వంటి నిషేధిత వస్తువులు పరీక్షా కేంద్రాలకు తీసుకురావద్దని సూచించారు. కష్టపడి చదివి ఇష్టపడి రాస్తే విజయం సాధించవచ్చని ఆయన పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.



