Saturday, June 21, 2025
E-PAPER
Homeజిల్లాలువిద్యుత్ కోతలకు నిరసనగా సబ్ స్టేషన్ ముట్టడి

విద్యుత్ కోతలకు నిరసనగా సబ్ స్టేషన్ ముట్టడి

- Advertisement -

– వందలాదిగా తరలివచ్చిన రైతులు, గ్రామస్తులు
– రైతులను, గ్రామస్తులను సముదాయించిన ఎస్ఐ అనిల్ రెడ్డి  
– తరచూ కరెంటు ట్రిప్ అవడంపై ఏఈ నిలదీత 
– మూడు, నాలుగు రోజుల్లో సరిచేస్తామన్న విద్యుత్ సిబ్బంది 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి  : మండల కేంద్రంలో విద్యుత్ కోతలకు నిరసనగా రైతులు గ్రామస్తులు శనివారం సబ్ స్టేషన్ ను ముట్టడించి ఆందోళన చేశారు. స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వందలాదిమంది  భరతమాత విగ్రహం నుండి ర్యాలీగా వెళ్లి గ్రామ శివారులో హాస కొత్తూర్ రోడ్డులో ఉన్న సబ్ స్టేషన్ ను ముట్టడించారు.

విషయం తెలుసుకున్న ఎస్ఐ అనిల్ రెడ్డి సబ్ స్టేషన్ వద్దకు చేరుకొని గ్రామస్తులతో మాట్లాడారు. ఆందోళన విరమించాలని, తాను విద్యుత్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అయినప్పటికీ గ్రామస్తులు విద్యుత్ అధికారులు వచ్చి సరైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు.గ్రామంలో విద్యుత్ కోతలకు నిరసనగా నినాదాలు చేశారు. సిబ్బంది సమాచారం అందించడంతో సబ్ స్టేషన్ వద్దకు చేరుకున్న ఏఈ అన్నయ్యపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు కోతలు, తరచు ట్రిప్ అవడం పై నిలదీశారు.

ఈ సందర్భంగా రైతులు, గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో ప్రతిరోజు 20 సార్లకు పైగా కరెంటు పోతుందన్నారు. ఈ విషయమై విద్యుత్ సిబ్బందిని ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పకుండా పట్టించుకోవడం లేదన్నారు. తరచూ కరెంటు ట్రిప్ అవడం వల్ల ఇండ్లలో టీవీలు, ఫ్రిజ్ లు, తోటల్లో కరెంటు మోటర్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రానికి పక్కనే ఉన్న ఉప్లూర్, నాగాపూర్, హాస కొత్తూర్, బషీరాబాద్, చౌట్ పల్లి గ్రామాల్లో  కరెంట్ ఎందుకు పోవట్లేదని ఏఈ, విద్యుత్  సిబ్బందిని నిలదీశారు. తరచూ కరెంట్ ట్రిప్ అవడంతో పంటలకు సరిగా నీరు అందించలేక పోతున్నామని, రెండు రోజుల క్రితం వర్షం పడకపోతే రైతులందరికీ ఎంత నష్టం జరిగేదో మీకేం తెలుసు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు….

గత నెల రోజుల నుంచి విద్యుత్ శాఖ సిబ్బందిని ఫాలో అప్ చేస్తున్న, ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు నుండి ఎలాంటి స్పందన లేకుండా పోయిందని గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు భోగ రామస్వామి అన్నారు. గ్రామంలో చిన్న చిన్న పనులకు కూడా సిబ్బంది ఎల్ సి  తీసుకోవడం మూలంగా ఊరు మొత్తం కరెంటు లేకుండా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.20 కంటే ఎక్కువ సార్లే పోతుందని, కొన్ని సార్లు పోయిన తర్వాత కరెంట్ తొందరగా రావడం లేదని, రాత్రి సమయంలో కూడా కరెంట్ ఉండడం లేదన్నారు. గ్రామస్తుల నుండి వచ్చిన వినతుల మేరకు గ్రామ కమిటీ స్పందించి అటవీశాఖ అధికారులతో కూడా మాట్లాడామన్నారు 10 రోజుల క్రితమే అటవీ శాఖ సిబ్బంది విద్యుత్ తీగల కింద చెట్ల కొమ్మలు కొట్టుకోవడానికి మాకు ఏమి అభ్యంతరం లేదని, తామెప్పుడు అభ్యంతరం చెప్పలేదని చెప్పినట్టు రామస్వామి తెలిపారు. కాకపోతే చిన్న లెటర్ రాసి పెట్టమని కోరినట్లు చెప్పినా ఆయన, అటవీ శాఖ నుండి ఎటువంటి ఇబ్బంది లేదన్నారు.

మూడు నాలుగు రోజుల్లో సమస్యలు సరి చేస్తాం..

 గ్రామంలో మూడు నాలుగు రోజుల్లో విద్యుత్ సమస్యలన్నింటినీ సరిచేసి ప్రజలకు నిరంతర కరెంటు అందించేందుకు ప్రయత్నిస్తామని ట్రాన్స్కో అన్నయ్య తెలిపారు. తరచూ విద్యుత్ అంతరాయాలు రావడం వల్ల తాము కూడా చింతిస్తున్నామన్నారు. పెద్ద పెద్ద చెట్లు బాగా ఉండడం వల్ల, బలమైన ఈదురు గాలులు తరచూ రావడం వల్ల చెట్లు విద్యుత్ తీగల తగిలి ట్రిప్పింగ్స్ అవుతున్నాయన్నారు. దీని మూలంగా రెండు మూడు రోజులు విద్యుత్ సరఫరాలో ఎక్కువ ఇబ్బందులు ఎదురయ్యాయి అన్నారు.మాకు  రెండు మూడు రోజులు టైం ఇస్తే అందరు సిబ్బందిని పిలిచి, కూలీలను పెట్టి అన్ని క్లియర్ చేసి కరెంట్ పోకుండ మా వంతు కృషి చేస్తామని, ఎక్కడ ప్రాబ్లం ఉన్న అన్ని చేస్తామని హామీ ఇచ్చారు.

గ్రామ కమిటీ పెద్దమనసుతో మాకు సహకరిస్తారని ఆశిస్తున్నామన్నారు. అదేవిధంగా కమ్మర్ పల్లి, నాగాపూర్ ఏజీఎల్ ఫీడర్ లలో కట్ పాయింట్లు పెడతామని మాటిచ్చారు. ఏ ఏరియాలో ప్రాబ్లం ఉంటే కట్ పాయింట్ ద్వారా ఆ ఏరియాలోనే కరెంటు సప్లై బంద్ అవుతుందన్నారు. విద్యుత్ సరఫరాలో సమస్య ఉంటే తొందరగా దొరుకుతుందని ఏఈ తెలిపారు. విద్యుత్ తీగల కింద చెట్లు ఎక్కడ ఉన్నా  రెండు రోజుల లోపల తీసివేసి కరెంటు పోకుండా చూస్తామని ఆందోళన చేస్తున్న రైతులకు, గ్రామస్తులకు తెలిపారు.కమ్మర్ పల్లి టౌన్ లో రోజుకు రెండుసార్లు మాత్రమే ఎల్ సి  తీసుకుంటామని, రైతులకు కూడా 11:30 గంటల నుండి కరెంటు త్రీ ఫేజ్  సరఫరా ఇస్తామని తెలిపారు. దీంతో శాంతించిన రైతులు, ప్రజలు ఆందోళన విరమించి వెనుదిరిగారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -