– ఏహెచ్ ఆర్ఎంఓ డాక్టర్ మౌనిక
నవతెలంగాణ – అశ్వారావుపేట : జీవితంలో ఏ రంగంలో ఎదగాలన్నా నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం ముందుకు కొనసాగాలని, అప్పుడే విజయావకాశాలు చేరువ అవుతాయని అశ్వారావుపేట ఏరియా హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్ మౌనిక పేర్కొన్నారు.
గురువారం పీఎం శ్రీ ఎంపీయూపీఎస్ నారంవారిగూడెం ప్రధానోపాధ్యాయులు పున్నం చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన కెరీర్ గైడెన్స్ పై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ మౌనిక స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు.
ఒక లక్ష్యాన్ని ఎంచుకుని దానిని సాధించడానికి నిరంతరం కష్ట పడాలని,ఒక నిర్దిష్ట మార్గంలో వెళితే అనుకున్న లక్ష్యాన్ని అవలీలగా సాధించడం సాధ్యం అవుతుందని ఆమె సూచించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు పున్నం చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ జీవితంలో ఏదో సాధించాలని అందుకు విద్యార్థి దశలోనే అందుకు బీజం పడాలని, అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి కష్టపడి కాకుండా ఇష్టపడి ప్రయత్నించాలని ఆయన అన్నారు.అనంతరం బాలికా సాధికారత – కౌమార బాలికల సంరక్షణ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నర్సింగ్ ఆఫీసర్ కృష్ణవేణి మాట్లాడుతూ బాలికలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించడం దేశ అభివృద్ధికి దోహదం చేస్తుందని తెలిపారు.కౌమార దశలో కలిగే ఆలోచనలు బాలబాలికలు ను పెడ త్రోవ వైపు తీసుకెళ్ళే ప్రమాదం ఉందని,అందుకని ఈ దశలో ఏ పనైనా ఆచి తూచి చేయాలని ముఖ్యంగా తల్లిదండ్రుల గురువుల సలహాలు సూచనలు పాటించాలని సూచించారు.
మరో నర్సింగ్ ఆఫీసర్ సుజాత మాట్లాడుతూ కౌమార దశలో కలిగే మార్పులు వాటి పట్ల బాలికలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు బండి శ్రీనివాస రెడ్డి, కొచ్చెర్ల శ్రీనివాస రావు,శ్రీమతి రేణుక, ఆశిక్ ఆలం,సోయం రవిబాబు,మంగమ్మ, మేల్ నర్సింగ్ ఆఫీసర్ గణేష్ లు పాల్గొన్నారు.
అనంతరం పాఠశాలకు వచ్చి స్ఫూర్తిదాయకమైన సూచనలు చేసిన అతిథులను ఉపాధ్యాయ సిబ్బంది ఘనంగా సత్కరించారు.



