నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆద్వర్యంలో,స్థానిక వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ హేమంత కుమార్ నేతృత్వంలో, కళాశాల అధ్యాపక బృందం పర్యవేక్షణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమం శుక్రవారం మండలంలోని కుడుములు పాడు, రెడ్డిగూడెం గ్రామాల్లో నిర్వహించారు. కుడుములు పాడులో కళాశాల అధ్యాపకులు డాక్టర్ పావని, డాక్టర్ కృష్ణ తేజ, వ్యవసాయ విస్తరణాధికారి రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయం చేసే రైతే మొట్టమొదటి శాస్త్రవేత్త అని రవీందర్ గారు అభిప్రాయ పడ్డారు. వ్యవసాయ సాగు నేడు ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని,వ్యయ భారాన్ని తగ్గించుకోవడం చాలా అవసరం అని, వ్యవసాయం మనిషి మనుగడకు అత్యవసరం అని స్థానిక రైతు జెడ్డా లక్ష్మయ్య అభిప్రాయం వ్యక్తం చేసారు. వ్యవసాయం లో నీటి యాజమాన్యం సరిగా లేకపోతే,సాగు నీటిని కూడా కొన్ని సంవత్సరాల తరువాత త్రాగు నీరు లాగా కొనాల్సిన దుస్థితి ఏర్పడుతుందని డాక్టర్ పావని గారు అభిప్రాయ పడ్డారు. కార్యక్రమం లో వివరిస్తున్న ఆరు ముఖ్యంశాలను తో పాటు వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, సాగు యాజమాన్యం,మట్టి పరీక్ష నమూనాల సేకరణ మొదలగు విషయాలు డాక్టర్ కృష్ణ తేజ చర్చించారు. రెడ్డిగూడెం లో వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ పి శ్రీలత మరియు డాక్టర్ డి స్రవంతి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధిక యూరియా వాడకం వలన వచ్చే అనర్థాలను, అధిక సాంద్రత పత్తి సాగులో మెలకువలు,నీటి కుంట వలన ఉపయోగాలు మరియు భూసార పరీక్ష విధానాన్ని గురించి డాక్టర్ డి స్రవంతి రైతులకి క్లుప్తంగా వివరించారు.రసాయనిక మందుల వాడకం వల్ల కలిగే నష్టాలను,పంట మార్పిడి పద్ధతి ద్వారా తెగుళ్ల నిర్మూలన,వివిధ పంటల్లో సమగ్ర సస్యరక్షణ చర్యలను, అలాగే విత్తనాలు పురుగు మందులు కొనుగోలు చేసినప్పుడు రసీదులను భద్రపరచుకోవాలని శాస్త్రవేత్త డాక్టర్ పి శ్రీలత సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శివరాం ప్రసాద్, వ్యవసాయ విస్తరణ అధికారి సతీష్,ఉద్యాన విస్తరణ అధికారి,గ్రామ పంచాయతీ సెక్రెటరీ మరియు రైతులు పాల్గొన్నారు.
విజయవంతంగా సాగుతున్న రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES