విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఫిల్మ్నగర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలతో ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కాజా సూర్యనారాయణ మాట్లాడుతూ,’తెలుగు సినిమా చరిత్రలో నెంబర్వన్ ఎన్టీఆర్. ఆయన ఆ రోజున తెలుగుదేశం పార్టీ స్థాపించకపోతే, ఈరోజున చాలామంది రాజకీయాల్లో, పలు పదవుల్లో ఉండేవారు కాదు. తెలుగు ఇండిస్టీకి ఎన్టీఆర్, ఏయన్నార్ రెండు కళ్లు. ఇప్పుడు ఇద్దరూ లేరు. అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం కూడా పెట్టాలని నా కోరిక. అందుకు పరిశ్రమ పెద్దలు కషి చేయాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.
‘తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప వ్యక్తి నందమూరి తారకరామారావు. తెలుగు జాతికి, సినిమాకు గుర్తింపు తీసుకొచ్చిన అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వాలి. దానికోసం మనమంతా కషి చేయాలి’ అని మాదాల రవి చెప్పారు. పరుచూరి గోపాలకష్ణ మాట్లాడుతూ, ”మనదేశం’ చిత్రంలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ప్రకారమే ఒక్కోమెట్టు ఎక్కుతూ ఏ స్థాయికి ఎదిగారో అందరికీ తెలిసిందే. ఆయన మనల్ని విడిచి 30 ఏళ్లు దాటినా, ఇప్పటికీ మా అందరినీ సజీవంగా వచ్చి పలకరిస్తునట్టే ఉంటుంది. ఆయన లేరని ఏ రోజూ అనుకోలేదు’ అని తెలిపారు.
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ,’తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంచిన వ్యక్తి ఎన్టీఆర్. స్వార్థం లేని మనిషి ఆయన. సినిమాల్లో ఆయన చేయని ప్రయోగం లేదు.. కథ లేదు. అలాంటి వ్యక్తిని ఏడాదికి ఓసారి జయంతి, వర్థంతులకు గుర్తు చేసుకొని, పూల మాలలు వేసి నివాళులు అర్పించడం కాదు.. రాజకీయాల్లో అయినా, సినిమాల్లో అయినా ఆయన్ని ఆదర్శంగా తీసుకునే ధైర్యం ఉండాలి’ అని అన్నారు. ‘ప్రతి నటుడికి నందమూరి తారకరామారావు ఓ శిక్షణాలయం. ప్రతి నటుడు, రాజకీయ నాయకుడు ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలి. తెలుగువాడి పౌరుషం, పరాక్రమం ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్’ అని ప్రసన్నకుమార్ అన్నారు.
వై.వి.ఎస్ చౌదరి మాట్లాడుతూ, ‘ఎన్టీఆర్ వెండితెర వేల్పుగా నిలిచారు. అంకితభావం, కార్యదక్షత, క్రమశిక్షణగా ఉండి అగ్రగామిగా ఎదిగారు. మద్రాసీలు అని పిలవబడుతున్న మనల్ని తెలుగుజాతి అని ప్రపంచవ్యాప్తంగా మన ఉనికికి చాటారు’ అని చెప్పారు.
అలాంటి గొప్ప వ్యక్తికి భారతరత్న ఇవ్వాలి
- Advertisement -
- Advertisement -



