69 మంది మృతి..170 మందికి గాయాలు
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో శుక్రవారం ఒక షియా మసీదుపై జరిగిన ఆత్మాహుతి దాడిలో 69 మంది మరణించారు. మరో 170 మంది గాయపడ్డారు. నగరంలోని షెహజాద్ టౌన్ ప్రాంతంలోని మసీదుపై శుక్రవారం ఉదయం ప్రార్థనల సమయంలో ఈ దాడి జరిగింది. ఆత్మాహుతి బాంబర్ను గుర్తించిన కొంత మంది మసీదు గేటు వద్దే అతన్ని అడ్డుకున్నారు. అయితే బాంబర్ అక్కడక్కడే తనుతాను పేల్చుకున్నాడు. శక్తవంతమైన పేలుడు కావడంతో ప్రాణనష్టం భారీగా జరిగిందని అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో కొంత మందికి తీవ్రగాయాలయ్యాయని, మరణాల సంఖ్య భారీగా పెరిగే అవకాశముందని అధికారులు చెప్పారు. ఈ దాడికి ఇంకా ఏ తీవ్రవాద సంస్థ కూడా బాధ్యత వహించలేదు.
అయితే, దాడికి పాల్పడ్డ ఆత్మాహుతి బాంబర్ విదేశీ పౌరుడని, తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ)తో ఇతనికి సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఇస్లామాబాద్లోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. ఈ సందర్భంగా ఆస్పత్రుల వద్ద అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇస్లామాబాద్లోని జిల్లా-సెషన్స్ కోర్టు భవనంలో బాంబు దాడిలో 12 మంది మరణించిన మూడు నెలల లోపే ఈ దాడి జరిగింది. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉజ్బెకిస్తాన్ అధ్యక్షులు షవ్కత్ మిర్జియోయేవ్ పర్యటిస్తున్న సమయంలో ఈ దాడి జరగడం ఆందోళన కలిగిస్తుంది. రెండు రోజుల పర్యటన కోసం షవ్కత్ గురువారం పాకిస్తాన్కు చేరుకున్నారు. పాకిస్తాన్ అధ్యక్షులు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ప్రతిపక్ష నేత అల్లామా రాజా నాసిర్ అబ్బాస్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ‘అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డం మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరం’ అని అధ్యక్షులు జర్దారీ పేర్కొన్నారు.



