నవతెలంగాణ – హైదరాబాద్: ఆదివారం వచ్చిందంటే చాలు తెల్లవారుజాము నుంచే మాంసం దుకాణాలు కళకళలాడుతుంటాయి. చికెన్, మటన్, చేపలు ఇలా ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్లు తెచ్చుకుంటూనే ఉంటారు. ఇక వైన్స్ ఓపెన్ కాగానే క్యూలైన్లు కట్టి మద్యం కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇక ఆ రోజు సుక్కా, ముక్కతో ఎంజాయ్ చేసేవారు చాలా మందే ఉంటారు. నాన్ వెజ్ ప్రియులు, మందు బాబులు.. ఆదివారం రోజును ఒక పండగ లాగా జరుపుకుంటారు.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తి గ్రామస్తులు ఆదివారం పవిత్ర దినంగా భావిస్తూ ఆరోజు మటన్, చికెన్ తినడం మద్యం తీసుకోవడం నిషేధించుకున్నారు. ప్రవచనకర్త భూపతి శ్రీనివాస్ మార్చి 2 నుంచి గ్రామంలో మహాభారత, రామాయణంపై ప్రవచనాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ప్రాముఖ్యతను వివరించారు. ఆదివారం ఆదిదేవుడు సూర్యభగవానుడి రోజని ఆరోజు మద్యం తాగరాదని, మాంసం తినవద్దని బోధించారు.
దీంతో గ్రామస్తులు సమావేశమై ఆదివారం ఏ ఇంట్లో మద్యం తీసుకోవడం, మాంసం తినడం చేయరాదని తీర్మానించారు. ఈ విషయం ఇంటింటికీ వెళ్లి వివరించారు. మద్యం, మాంసం నిషేధంపై గ్రామ కూడళ్లలో బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం గర్షకుర్తిలో ఆదివారం ఎవరూ మద్యం, మాంసం ముట్టడంలేదు.