ఢిల్లీ క్యాపిటల్స్పై చెన్నై ఘన విజయం
సంజు శాంసన్ అజేయ సెంచరీ
చెన్నై 212/2, ఢిల్లీ 189/10
నవతెలంగాణ-చెన్నై
చెన్నై సూపర్కింగ్స్ ఎట్టకేలకు ఓ విజయం సాధించింది. శనివారం చెపాక్లో ఢిల్లీ క్యాపిటల్స్పై 23 పరుగుల తేడాతో సూపర్కింగ్స్ గెలుపొందింది. సీజన్లో 4 మ్యాచ్ల్లో చెన్నైకిదే తొలి విజయం. ఓపెనర్ సంజు శాంసన్ (115 నాటౌట్, 56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్లు) అజేయ సెంచరీతో ఫామ్లోకి వచ్చాడు. యువ బ్యాటర్ ఆయుశ్ మాత్రె (59, 36 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లు) అర్థ సెంచరీతో రాణించాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (15, 18 బంతుల్లో 1 ఫోర్) పవర్ప్లేలో నిరాశపరిచాడు. సంజు శాంసన్ 9 ఫోర్లతో 26 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించినా.. రుతురాజ్ దూకుడుగా ఆడలేదు. ఆయుశ్ మాత్రె 3 ఫోర్లు, 4 సిక్స్లతో 27 బంతుల్లో అర్థ సెంచరీ సాధించినా.. ఆ తర్వాత ఆ జోరు కొనసాగించలేదు.
దీంతో ఆయుశ్ రిటైర్డ్ హర్ట్గా నిష్క్రమించాడు. శివం దూబె (20 నాటౌట్, 10 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) ఆఖర్లో మెప్పించాడు. సంజు శాంసన్ సెంచరీ, ఆయుశ్ అర్థ సెంచరీ కొట్టినా.. సూపర్కింగ్స్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 212 పరుగులే చేసింది. ఇక ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ తేలిపోయింది. సూపర్కింగ్స్ పేసర్ జెమీ ఓవర్టన్ (4/18), అన్షుల్ కాంబోజ్ (3/35) ఢిల్లీ బ్యాటర్లకు ముకుతాడు వేశారు. ఓపెనర్ నిశాంక (41, 24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లు), ట్రిస్టన్ స్టబ్స్ (60, 38 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లు) మెరిసినా.. ఇతర బ్యాటర్లు నిరాశపరిచారు. కెఎల్ రాహుల్ (18), సమీర్ రిజ్వీ (6), అక్షర్ పటేల్ (1), డెవిడ్ మిల్లర్ (17), ఆషుతోశ్ శర్మ (19) నిరాశపరిచారు. 20 ఓవర్లలో 189 పరుగులకు ఢిల్లీ క్యాపిటల్స్ ఆలౌటైంది. సీజన్లో 4 మ్యాచ్ల్లో క్యాపిటల్స్కు ఇది వరుసగా రెండో ఓటమి.



