ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఈ నెల 9న సార్వత్రిక సమ్మెకు వ్యవసాయ కార్మికులు మద్దతు ఉంటుందని ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ తెలిపారు. గురువారంనాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ జులై 9న సమ్మె కార్పొరేట్ దోపిడీ, గ్రామీణ ధనిక వర్గాలకు వ్యతిరేకంగా అన్ని రకాల ఉత్పత్తి వర్గాలు తిరుగుబాటు అని అన్నారు. హిందుత్వ శక్తుల విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా సమిష్టి పోరాటమని చెప్పారు. సార్వత్రిక సమ్మెకు దేశవ్యాప్తంగా లక్షలాది ప్రజల నుంచి మద్దతు వెల్లువెత్తుతోందనీ, శ్రామికులు, వ్యవసాయ కార్మికులు, ఉద్యోగులు, రైతులు, కౌలుదారులు, వృత్తిదారులతో సహా ఉత్పత్తి వర్గాలన్నీ ఒకే వేదికపై ఐక్యంగా పోరాటానికి దిగుతున్నాయని అన్నారు. మోడీ మోడల్ దోపిడీ పాలనకు గట్టి సమాధానమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ”దేశ సంపద మిలియనీర్ల వద్ద కేంద్రీకృతమవుతోంది. పని చేసే వర్గాలు పస్తులుంటున్నాయి. కార్మికులు, రైతులు కష్టపడి శ్రమిస్తే, లాభాలు కార్పొరేట్ల జేబులోకి వెళ్తున్నాయి” అని వెంకట్ విమర్శించారు. ”భారత రాజ్యాంగం చెప్పేది సమానత్వం, మోడీ పాలన అమలుపరిచేది అసమానత్వం” అని అన్నారు. ”ఉపాధి హామీపై మోడీ ప్రభుత్వం పగ తీర్చుకుంటోంది. బడ్జెట్ కుదింపు, ఆధార్ అనుసంధానం పేరుతో ఏకంగా 7 కోట్ల మంది కూలీలను తొలగించారు. ఇప్పుడు ఏడాది మొదటి ఆరు నెలలు బడ్జెట్లో 60 శాతం మాత్రమే ఖర్చు చేయాలని ఆదేశించడం చట్ట విరుద్ధం. 70-80 శాతం పని దినాలు ఏప్రిల్ నుంచి జులై వరకూ ఉంటాయి. పట్టణాల్లోనూ ఉపాధి హామీ చట్టం ప్రవేశపెట్టాలి. కనీసం రూ.2.5 లక్షల కోట్లు బడ్జెట్ కేటాయించాలి” అని ఆయన డిమాండ్ చేశారు.
జులై 9 సార్వత్రిక సమ్మెకు మద్దతు
- Advertisement -
- Advertisement -