Friday, May 30, 2025
E-PAPER
Homeజాతీయంమద్దతు ధర పెంపు

మద్దతు ధర పెంపు

- Advertisement -

– కేంద్ర మంత్రివర్గం ఆమోదం
– వరి సహా 14 పంటలకు ప్రకటన
– రూ.2.7 లక్షల కోట్లు కేటాయింపు
– కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

కేంద్ర మంత్రివర్గం ఖరీఫ్‌ సీజన్లో వరి సహా 14 పంటలకు మద్దతు ధర ప్రకటించింది. 2025-26 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి క్వింటాల్‌ వరిపై రూ.69 పెంచడంతో కనీస మద్దతు (ఎంఎస్పీ) ధర రూ. 2,369కి చేరింది. బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం మంత్రివర్గ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాకు వెల్లడించారు. గత 10-11 ఏండ్లలో ఖరీఫ్‌ పంటలకు ఎంఎస్పీ భారీగా పెంచినట్టు ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే ఖరీఫ్‌ మార్కెటింగ్‌ సీజన్‌ కోసం ఎంఎస్పీ పెంపును కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందన్నారు. ఆయా పంటల ఎంఎస్పీ కోసం రూ.2.7లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. జొన్నలు క్వింటాల్‌కు రూ.328, సజ్జలు క్వింటాల్‌కు రూ.150, రాగులు క్వింటాల్‌ రూ.596, మొక్కజొన్న క్వింటాల్‌కు రూ.175 పెంచినట్టు కేంద్రమంత్రి వివరించారు. కందిపప్పు క్వింటాల్‌కు రూ.450, పెసర్లు క్వింటాల్‌కు రూ.86, మినుములు క్వింటాల్‌కు రూ.400, వేరుశెనగ క్వింటాల్‌కు రూ.480 పెంచినట్టు తెలిపారు. పొద్దుతిరుగుడు క్వింటాల్‌కు రూ.441, సోయాబీన్‌ క్వింటాల్‌కు రూ.436, కుసుములు క్వింటాల్‌కు రూ.579, వలిసెలు క్వింటాల్‌కు రూ.820, పత్తి క్వింటాల్‌కు రూ.589 పెంచినట్టు చెప్పారు. 2025-26లో సవరించిన వడ్డీ రాయితీ పథకం (ఎంఐఎస్‌ఎస్‌) కొనసాగింపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుత వడ్డీ రాయితీ 1.5 శాతం యథాతథంగా కొనసాగుతుంది. రైతులకు వడ్డీ రాయితీ కింద రూ.15,642 కోట్లతో పాటు అన్నదాతల పెట్టుబడిపై 50 శాతం మార్జిన్‌ ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వివరించారు. వార్దా-బల్లార్షా (మహారాష్ట్ర), రత్లాం-వార్దా (మధ్యప్రదేశ్‌) మధ్య రైల్వే లైన్‌కు ఆమోదం లభించింది. ఈ రెండు ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం దాదాపు రూ. 3,399 కోట్లు కాగా, 2029-30 నాటికి పూర్తవుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
రూ.3,653 కోట్లతో బద్వేల్‌- నెల్లూరు నాలుగు లేన్ల రోడ్డు
ఏపీలోని బద్వేల్‌- నెల్లూరు నాలుగు లేన్ల రహదారి విస్తరణకు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ ఆమోదం తెలిపింది. రూ.3,653 కోట్లతో ఎన్‌హెచ్‌-67లో 108.134 కిలోమీటర్ల పొడవున ఈ రహదారిని అభివృద్ధి చేయనుంది. బద్వేల్లోని గోపవరం నుంచి నెల్లూరు జిల్లాలోని గురివిందపూడి వరకు నిర్మాణం చేపట్టే ఈ కారిడార్‌తో కృష్ణపట్నం పోర్టుకు ప్రయాణ దూరం దాదాపు 33.9 కిలోమీటర్లు తగ్గనుంది. అలాగే, ఈ కారిడార్‌ నిర్మాణంతో భారీగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేంద్రం తెలిపింది. డిజైన్‌-బిల్డ్‌-ఫైనాన్స్‌-ఆపరేట్‌-ట్రాన్స్‌ఫర్‌ (డీబీఎఫ్‌ఓటీ) పద్ధతిలో చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని మూడు పారిశ్రామిక కారిడార్‌లలో విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ (వీసీఐసీ)లోని కొప్పర్తి, హైదరాబాద్‌-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ (హెచ్‌బీఐసీ) లోని ఓర్వకల్‌, చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ (సీబీఐసీ)లోని కృష్ణపట్నంలను ఇది అనుసంధానించనుంది. ఇది దేశంలోని సరుకు రవాణా పనితీరు సూచిక (ఎల్‌పీఐ)పై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. బద్వేల్‌- నెల్లూరు కారిడార్‌ వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలోని ప్రస్తుత జాతీయ రహదారి ఎన్‌హెచ్‌-67లోని గోపవరం గ్రామం వద్ద ప్రారంభమై ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లాలోని ఎన్‌హెచ్‌-16 (చెన్నై-కోల్‌కతా)లోని కృష్ణపట్నం ఓడరేవు జంక్షన్‌ వద్ద ముగుస్తుంది.
ప్రతిపాదిత కారిడార్‌ కృష్ణపట్నం ఓడరేవుకు ప్రయాణ దూరాన్ని ప్రస్తుత బద్వేల్‌-నెల్లూరు రహదారితో పోలిస్తే 142 కిలోమీటర్ల నుంచి 108.13 కిలో మీటర్లకు అంటే 33.9 కిలో మీటర్లు తగ్గిస్తుంది. ఇది ప్రయాణ సమయాన్ని ఒక గంట తగ్గించనుంది. ఇంధన వినియోగాన్ని తగ్గించడంతో కర్బన ఉద్గారాలు, వాహన నిర్వహణ ఖర్చు (వీఓసీ) తగ్గి మొత్తంగా గణనీయమైన సానుకూల ప్రభావాన్ని చూసిస్తుంది. 108.134 కిలో మీటర్ల ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా 20 లక్షల పని దినాలు, పరోక్షంగా 23 లక్షల పని దినాల ఉపాధి లభించనుంది. ప్రతిపాదిత కారిడార్‌ పరిసరాల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరగడం వల్ల ఈ ప్రాజెక్టుతో అదనపు ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడతాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -