నిర్మలాసీతారామన్ను కలిసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ఎంపీల బృందం
యంగ్ ఇండియా స్కూల్స్ కోసం ఎఫ్ఆర్బీఎం పరిధి పెంచాలని ఆర్థిక మంత్రికి వినతి
హైదరాబాద్కు ఐఐఎం మంజూరు చేయాలని ధర్మేంద్ర ప్రధాన్కు విజ్ఞప్తి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యంగ్ ఇండియా స్కూల్స్కు ఆర్థిక వెసులుబాటుతోపాటు హైదరాబాద్కు ఐఐఎం మంజూరు చేయాలని కోరారు. ఈ మేరకు మంగళవారం పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్లను ఆయన వేర్వేరుగా కలిసి వినతి పత్రాలు సమర్పించారు. ఈ భేటీలో ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేంద్ర రెడ్డితో పాటు ఎంపీలు పాల్గొన్నారు. తొలుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను వారు ఆమె ఛాంబర్లో కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యారంగంపై ప్రభుత్వం పెడుతోన్న ఫోకస్ గురించి వివరించారు. ఇందులో భాగంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల (వైఐఐఆర్ఎస్)ను నిర్మిస్తున్నట్టు చెప్పారు. విద్యార్థుల బంగారు భవిష్యత్కు బాటలు వేసే ఈ ప్రాజెక్ట్, ఇతర విద్యాభివృద్ధి రుణాలకు ఎఫ్ఆర్బీఎం నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అనంతరం కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కలిసి హైదరాబాద్లో ఐఐఎం, కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
విద్యా రంగంపై శ్రద్ధకు ఆర్థిక మంత్రి ప్రశంసలు
తెలంగాణ విద్యారంగం అభివృద్ధికి తాము తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా నిలవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందిం చేందుకు రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. తెలంగాణ వ్యాప్తంగా 105 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్మిస్తోన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల (వైఐఐఆర్ఎస్) ప్రాధాన్యతను తెలియజేశారు. 5 నుంచి 12 తరగతుల వరకు ఉండే ఒక్కో వైఐఐఆర్ఎస్లో 2,560 మంది విద్యార్థులు ఉంటారని, మొత్తంగా 105 పాఠశాలల్లో 2.70 లక్షల మంది విద్యార్థులకు ప్రత్యక్షంగా నాణ్యమైన విద్యాబోధన లభిస్తుందని సీఎం వివరించారు. వైఐఐఆర్ఎస్లు సమీప ప్రభుత్వ పాఠశాలలకు విద్యా హబ్లుగా ఉండడంతో పరోక్షంగా లక్షలాది మంది విద్యార్థు లకు ప్రయోజనం కలుగుతుందన్నారు.
అత్యాధునిక వసతులు, లేబొరేటరీలు, స్టేడియాలతో నిర్మించే ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి రూ.21 వేల కోట్ల వ్యయమవుతుందని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి చెప్పారు. అలాగే, రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ, సాంకేతిక కళాశాలలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో ఆధునిక ల్యాబ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు మరో రూ.9 వేల కోట్లు వెచ్చించనున్నట్టు వివరించారు. మొత్తంగా రాష్ట్రంలో విద్యా రంగం సమగ్రాభివృద్ధికి తమ ప్రభుత్వం రూ.30 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. ఈ నిధుల సమీకరణకు తాము ప్రత్యేక ప్రయోజన సంస్థ (ఎస్ పీసీ)ను ఏర్పాటు చేయనున్నామని, దాని ద్వారా సేకరించే రుణా లకు ఎఫ్ఆర్బీఎం పరిమితి నుంచి మినహా యించాలని విజ్ఞప్తి చేశారు. విద్యా రంగంపై తమ ప్రభుత్వం చేస్తున్న వ్యయాన్ని మానవ వనరుల అభివృద్ధికి చేస్తున్న పెట్టుబడిగా భావించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. ఈ సందర్భంగా వైఐఐఆర్ఎస్ రూపంలో తెలంగాణలో విద్యా రంగం అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి చూపుతున్న చొరవపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసించారు. వైఐఐఆర్ఎస్ మోడల్ బాగుం దని, ఎస్పీసీకి సంబంధించిన వివరాలను అందజేయాలని సూచించారు.
హైదరాబాద్కు ఐఐఎం మంజూరు చేయండి
హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)ను మంజూరు చేయాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఏరో స్పేస్, డిఫెన్స్, లాజిస్టిక్స్, అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో ముందున్న హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో 19 రాష్ట్రాల్లో, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో కలిపి 21 ఐఐఎంలు ఉన్నాయని, తెలంగాణ రాష్ట్రంలోనూ ఐఐఎం ఏర్పాటు చేయాలని కోరారు. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రాంగణంలో గుర్తించామన్నారు. ఐఐఎం తరగతులు వెంటనే ప్రారంభించేందుకు ట్రాన్సిట్ క్యాంపస్ సిద్ధంగా ఉందన్నారు. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన అనుమతులు వెంటనే మంజూరు చేయడంతో పాటు అవసరమైన వసతుల కల్పనకు తాము సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. దేశంలోని అన్ని ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు వీలుగా హైదరాబాద్కు ఎయిర్, రైల్, రోడ్ కనెక్టివిటీ ఉందని, అనుకూల వాతావరణం, భిన్న రంగాల ప్రముఖులను అందజేసిన చరిత్ర హైదరాబాద్కు ఉందని తెలిపారు.
హైదరాబాద్ లో ఐఐఎం ఏర్పాటు చేస్తే అది తెలంగాణ రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన పిల్లల అవకాశాలను మెరుగుపర్చుతుందన్నారు. అలాగే తెలంగాణలో పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా నూతనంగా 9 కేంద్రీయ విద్యాలయాలు, 16 జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలని కోరారు. పెరుగుతున్న పట్టణీకరణ, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు అవసరాన్ని వివరించారు. కొమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, జోగులాంబ గద్వాల, నారాయణపేట, నాగర్కర్నూల్, సూర్యాపేట, వికారాబాద్, నిర్మల్ జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్ చేశారు. దీంతో పాటు హనుమకొండ, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, ములుగు, నారాయణపేట, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయాలు వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విద్యాలయాల ఏర్పాటుకు అవసరమైన స్థలం, ఇతర వసతులు కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
అభివృద్ధికి సహకరించండి
- Advertisement -
- Advertisement -



