నవతెలంగాణ – హైదరాబాద్ : జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ను కలిసేందుకు ఆయన పార్టీ న్యాయవాదిని పాకిస్థాన్ సుప్రీంకోర్టు మంగళవారం అనుమతించింది. ”జైలులో ఇమ్రాన్ఖాన్ ప్రస్తుత జీవన పరిస్థితులకు” సంబంధించి నివేదికను సమర్పించాల్సిందిగా పేర్కొంది. పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ (పిటిఐ) పిటిషన్ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యహ్యా అఫ్రీది, జస్టిస్ షాహిద్ బిలాల్ హసన్లతో కూడిన సుప్రీంకోర్టు ప్యానెల్.. పార్టీ న్యాయవాది సల్మాన్ సఫ్దార్ను ఇమ్రాన్ఖాన్ను కలిసేందుకు అనుమతించింది. సఫ్దార్ను అమికస్ క్యూరీగా నియమించింది. ‘ కోర్టు స్నేహితుడిగా సల్మాన్ సఫ్దార్ అడియాలా జైలులో ఉన్న ఖాన్ను కలవాలి” అని అఫ్రీది పేర్కొన్నారు. కోర్టు అతనిపై పూర్తి విశ్వాసం కలిగి ఉందని అన్నారు. సఫ్దార్ ఇమ్రాన్ఖాన్తో మాట్లాడేందుకు పూర్తి అనుమతి ఇవ్వాలని, అప్పుడు ఆయన వ్రాతపూర్వక ప్రతిస్పందనను దాఖలు చేయగలడని పేర్కొన్నారు. సఫ్దార్ను జైలు వెలుపల వేచి ఉండేలా చేయకూడదని జైలు అధికారులను ఆదేశించారు. ఇమ్రాన్ఖాన్ను కలిసేందుకు అనుమతించాలంటూ కోరిన న్యాయవాది లతీఫ్ కోసా పిటిషన్ను ప్యానెల్ తిరస్కరించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 12కి వాయిదా వేసింది.
డిసెంబర్ 2న ఖాన్ సోదరి ఉజ్మాఖాన్ 20 నిమిషాలు ఆయనతో మాట్లాడిన తర్వాత, ఖాన్ను కలిసేందుకు అనుమతించడం ఇదే మొదటిసారి కానుంది. అయితే వారానికొకసారి జరిగే సమావేశాలను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారంటూ జైలు అధికారులు కుటుంబసభ్యులు, న్యాయవాదులకు అనుమతి నిరాకరించారు. అవినీతి కేసులో దోషిగా తేల్చిన తర్వాత ఇమ్రాన్ఖాన్ను 2023 ఆగస్ట్5న లాహోర్లోని ఆయన నివాసం నుండి పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇమ్రాన్ఖాన్ రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్నారు.



