అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ వ్యవహారంలో..
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పదేండ్ల నాటి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ వ్యవహారంలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ)కు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. 2015లో అస్టిస్టెంట్ మోటార్ వెహికల్ ఇనెస్పెక్టర్ రిక్రూట్మెంట్ను టీజీపీఎస్సీ నిర్వహించింది. అయితే ఈ రిక్రూట్మెంట్లో మెడికల్ టెస్ట్లు సరిగా నిర్వహించకపోవడంతో తనకు అన్యాయం జరిగిందని అభ్యర్థి రవికుమార్ గత నెల 22న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను బుధవారం జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్ వీ అంజారియాల ద్విసభ్య ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ… మెడికల్ ఎగ్జామినేషన్ సరిగా నిర్వహించకపోవడం వల్ల చాలా మంది ఉద్యోగ అవకాశాల్ని కోల్పోయారన్నారు.
ఈ ఎగ్జామినేషన్కు మూడ్రోజుల ముందు తాను ప్రభుత్వాస్పత్రిలో మెడికల్ ఎగ్జామ్ చేయించుకున్నట్టు తెలిపారు. ఈ పరీక్షలో తన చాతి 7 సెంటీ మీటర్లు ఉన్నట్టు తేలిందన్నారు. అయితే టీజీపీఎస్సీ సమర్థవంతంగా పరీక్షలు నిర్వహించని కారణంగా ఉద్యోగానికి తాను అర్హత సాధించలేదని కోర్టుకు నివేదించారు. ఇందుకు సంబంధించి ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారాన్ని కోర్టు ముందుంచారు. అందువల్ల తనకు ఉద్యోగ అవకాశాన్ని కల్పించాలని కోరారు. ఈ కేసు తీర్పు వెలువడే వరకు ఒక పోస్ట్ను ఖాళీగా పెట్టాలని కోర్టును అభ్యర్థించారు. అయితే పోస్ట్ ను ఖాళీగా ఉంచలేమని, అవసరమైతే పోస్ట్ క్రియేట్ చేసి ఇస్తామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాగే టీజీపీఎస్సీతో పాటు తెలంగాణ ప్రభుత్వం, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వాయిదా వేసింది.
టీజీపీఎస్సీకి సుప్రీం నోటీసులు
- Advertisement -
- Advertisement -



