అంగీకరించని బార్ అసోసియేషన్
న్యూఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవారుపై దాడి చేసిన న్యాయవాది రాకేష్ కిషోర్పై చర్యలకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇలాంటి ఘటనలను విస్మరించడం ద్వారానే వాటికి తగిన సమాధానం చెప్పినట్లుగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) ఈ అభిప్రాయాన్ని తిరస్కరించింది. ఎటువంటి చర్యలు తీసుకోకుండా దాడి చేసిన న్యాయవాదిని విడుదల చేయడం వలన సుప్రీంకోర్టు ఒక జోక్గా మారిపోతుందని పేర్కొంది. ఈ దాడి కేసుపై సోమవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోరుమల్య బాగ్ఛిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ కేసుపై సుప్రీంకోర్టు తీసుకునే ఏ చర్య అయినా పరిస్థితిని మరింత దిగజార్చుతుందని, రాకేష్ కిషోర్కు మరింత ప్రాచుర్యం వస్తుందని, మీడియా, సోషల్మీడియాలో ఈ దాడి గురించి మరింత విస్తృతంగా వార్తలు వస్తాయని ధర్మాసనం పేర్కొంది. ఈ దాడిని ‘అద్భుతమైన ఉదారత’తో గవారు క్షమించారని ధర్మాసనం గుర్తు చేసింది. ఈ దాడిని సీజేఐ విస్మరించిన తరువాత మరొక బెంచ్కు లేదా, అటార్నీ జనరల్ ధిక్కార చర్యలకు అనుమతి ఇవ్వాలా..? అని ధర్మసనం ప్రశ్నించింది. అయితే ఎస్సీబీఏ తరుపున హాజరైన సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్, న్యాయవాది ప్రగ్యా బాఘెల్ ధర్మాసనం వ్యాఖ్యలను అంగీకరించలేదు. రాకేష్ కిషోర్ నిరంతర ధిక్కార వైఖరిని కలిగిఉండే వ్యక్తని తెలిపారు. ఈ దాడిని సీజేఐ క్షమించినా కిషోర్ తన చర్యలకు ఎలాంటి పశ్చాత్తాపం చూపలేదని, ఇందుకు బదులుగా తన దాడి చర్యను పదేపదే కీర్తించుకున్నాడని, పైగా ‘మళ్లీ అలా చేస్తాను’ అని చెప్పాడని గుర్తు చేశారు. దీంతో ఈ కేసు విచారణను వారం రోజుల తరువాతకు ధర్మాసనం వాయిదా వేసింది.
సీజేఐపై దాడి కేసు.. న్యాయవాదిపై చర్యలకు సుప్రీంకోర్టు తిరస్కరణ
- Advertisement -
- Advertisement -



