నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాలను ట్రైబల్ గ్రామాలుగా మార్చిన నోటిఫికేషన్పై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ వ్యవహారంలో కోర్టు తుది తీర్పు వచ్చే వరకు నోటిఫికేషన్ అమలు చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 23 గ్రామాలను ట్రైబల్ గ్రామాలుగా గుర్తిస్తూ 2013లో వరంగల్ కలెక్టర్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ…. పలువురు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం ఈ 23 గ్రామాలు ఆదివాసీ గ్రామాలే అని తీర్పునిచ్చింది. పిటిషనర్లు మరోసారి కోర్టును ఆశ్రయించగా… 2023లో సీజేతో కూడిన ధర్మాసనం సింగిల్ బెంచ్ తీర్పును సమర్థిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. దీంతో 75 ఏండ్లుగా కొనసాగుతోన్న వివాదానికి ఫుల్ స్టాప్ పడిందని భావించారు. అయితే… హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సీహెచ్ పరమాత్మ, పూజారీ సమయ్య అదే ఏడాది ఆగస్టులో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను మంగళవారం జస్టిస్ జే కె మహేశ్వరీ, జస్టిస్ విజరు బిష్నోలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది.
పిటిషనర్ల తరపున సీనియర్ అడ్వొకేట్లు వివేక్ టంకా, విష్ణువర్థన్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వొకేట్లు అభిషేక్ మను సింఘ్వీ, గౌరవ్ అగర్వాల్, ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ శ్రవణ్లు హాజరయ్యారు. తొలుత పిటిషనర్ల తరపు అడ్వొకేట్లు వాదనలు వినిపిస్తూ… 1950లో ప్రెసిడెంట్ ఇచ్చిన ఆర్డర్లో మంగపేటలోని 23 గ్రామాలు లేవని కోర్టుకు నివేదించారు. అందువల్ల ఆ గ్రామాలను ట్రైబల్ గ్రామాలుగా గుర్తించవద్దని కోరారు. ఈ వాదనలను ప్రభుత్వ అడ్వకేట్లు తోసి పుచ్చారు. ఈ గ్రామాలన్నీ ట్రైబల్ విలేజీలే అని వాదించారు. ఈ 23 గ్రామాలను ప్రెసిడెంట్ నోటిఫై చేశారని కోర్టుకు తెలిపారు. పాల్వంచ తాలుకాలోని ఆరు గ్రామాలను హైదరాబాద్ గవర్నమెంట్ రికమెండ్ చేసిందన్నారు. అయితే ప్రెసిడెంట్ దీన్ని నోటిఫై చేయడానికి కొంత టైం పట్టిందని వివరిం చారు. ఈ మధ్యలో రెవెన్యూ గ్రామాల కింద ములుగులో కలిపారని తెలిపారు. ఇది కేవలం పాలన పరమైందే తప్ప… ప్రెసిడెంట్ నోటిఫైకు వ్యతిరేకం కాదన్నారు. అందువల్ల ఈ విలేజీలు ట్రైబల్ గ్రామాలే అని వాదించారు. ఇరువైపు వాదన లను పరిగణనలోకి తీసుకొన్న ధర్మసనం… కోర్టు తుది తీర్పు వెలువరించే వరకు వీటిని ట్రైబల్ విలేజీ లుగా గుర్తించవద్దని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. తదుపరి విచారణను రెండు నెలలకు వాయిదా వేసింది.
ఆ 23 గ్రామాల్లో ఎన్నికలపై సుప్రీం స్టే
- Advertisement -
- Advertisement -