నవతెలంగాణ హైదరాబాద్: అమెరికా- ఇజ్రాయెల్ తమపై అకారణంగా దాడులు చేస్తున్నాయని ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ మండిపడ్డారు. ఇస్లామిక్ రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేసిన సందేశంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ…ఈ దాడుల కారణంగా దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను తిరిగి పునరుద్ధరించడానికి నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు.
అమెరికా- ఇజ్రాయెల్ తమ దేశంపై కొనసాగిస్తోన్న నీచమైన, దురాక్రమణ దాడులను మొజ్తాబా ఖండించారు. ఈ దాడుల కారణంగా ఇరాన్లో మౌలిక సదుపాయాలతో పాటు పర్యావరణం కూడా దెబ్బతిందన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం దేశ అంతర్గత అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు. అభివృద్ధిని విస్తరించడం, ఇరాన్ ఉజ్వల భవిష్యత్తుకు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ఇరాన్లోని మినాబ్ పాఠశాలపై జరిగిన దాడి గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ఘటనలో 186 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. వీరికి నివాళిగా పట్టణ, గ్రామీణప్రాంతాల్లో నిర్వహిస్తున్న మొక్కలు నాటే కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. యుద్ధంలో చనిపోయిన వారిని స్మరించుకుంటూ ఇరాన్ ప్రజలు మొక్కలు నాటనున్నట్టు తెలిపారు.



