నవతెలంగాణ – జుక్కల్
జనవరి 20న జుక్కల్ మండలంలోని దోస్తుపల్లి – బంగారు పల్లి గ్రామ శివారులో పులి మరణించిన విషయం పాఠకులకు తెలిసిందే. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు పులిని చనిపోయందా.. చంపేశారా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా అన్ని కోణాలలో పరిశీలించిన అనంతరం ఫారెస్ట్ శాఖ, వెటర్నరీ వైద్య అధికారులు నిర్వహించిన పంచనామాలో పలు ఆసక్తికరమైన అనుమానాలు వ్యక్తం చేశారు. పులిపైన ఏదైనా విష ప్రయోగం జరిగిందా? ఎవరైనా వేటాడి చంపేశారా? ఇలా అనే పలు అంశాలను పరిగణలోకి తీసుకొని ఆ కోణాలలో దర్యాప్తు చేశామని ఎఫ్ఆర్ఓ సంతోషా, డివైఎఫ్ఓ సుజాత తెలిపారు.
వీరు తెలిపిన వివరాల ప్రకారం.. దోస్తుపల్లిలో ఆవు దూడను పులి వేటాడి చంపిందని అనుమానంతో గమనించిన రైతు పులి చంపిందా? లేదా ఇంకా ఏదైనా క్రూర మృగాలు చంపేశాయా? అని అనుమానంతో తన ఆవు లేగ దూడలను చంపేస్తున్నాయని, ఆవు మృతదేహంపై ఇంకో రైతు సహకారంతో విషం చల్లాడని తెలిపారు. మరుసటి రోజు మళ్లీ ఆవు దూడ కళేబరాన్ని తిన్న పులి మరణించిందని దర్యాప్తులో తేలిందని తెలిపారు.
ఆ రైతులు దోస్తుపల్లి, బంగారు పల్లి గ్రామానికి చెందిన వారిగా పేర్కొన్నారు. అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని రేంజ్ అధికారిని సంతోషి, డివైఎఫ్ఓ సుజాత తెలిపారు.



