నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రపంచంలో అతిపెద్ద బీరు తయారీ సంస్థగా పేరుగాంచిన ఏబీ ఇన్బెవ్ సైతం తెలంగాణలో తమ యూనిట్ ను విస్తరించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఇవాళ దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధుల బృందం ఏబీ ఇన్బెవ్ చీఫ్ లీగల్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ ఆఫీసర్ జాన్ బ్లడ్తో సమావేశమయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం రెండు తయారీ యూనిట్లు నిర్వహిస్తున్న ఏబీ ఇన్బెవ్, సుమారు 600 మందికి ఉపాధి కల్పిస్తోంది. రాష్ట్రానికి కొత్త పెట్టుబడి లభించినందుకు సీఎం సంతోషం వ్యక్తం చేశారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్లో భాగంగా 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే దిశగా ఆదాయ వృద్ధి, సామర్థ్య నిర్మాణమే కీలకమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాగా ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 50కుపైగా దేశాల్లో సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
విశ్వాసం పెరుగుతోంది:
ఈ సందర్భంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. విధాన స్థిరత్వం, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, వ్యాపార సౌలభ్యంతో తెలంగాణలో పెట్టుబడిదారుల్లో దీర్ఘకాలికంగా విశ్వాసం పెరుగుతోందని తెలిపారు. ఈ సమావేశంలో సర్క్యులర్ వాటర్ వినియోగం, మహిళా సాధికారత, విద్య, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించిన సీఎస్ఆర్ వ్యయాలు వంటి అంశాల్లో తెలంగాణతో కలిసి పనిచేసే అవకాశాలపై కూడా చర్చించారు.



