పెండింగ్ బిల్లుల కోసం రూ.720 కోట్లు విడుదల
సరెండర్ లీవుల ఎన్క్యాష్మెంట్ ఒకేసారి మంజూరు : ఉప ముఖ్యమంత్రి భట్టి
నవ తెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు లభించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలతో ఉద్యోగుల పెండింగ్ బిల్లులు రూ.720 కోట్లు ఆర్థిక శాఖ విడుదల చేసింది. ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తున్నది. ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ప్రభుత్వం గ్రీన్ చానెల్లో పెండింగ్ నిధులను నెలవారీగా విడుదల చేస్తున్నది. జనవరికి సంబంధించిన పెండింగ్ బిల్లుల విడుదలకు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం రూ.720 కోట్లు ఆర్థిక శాఖ అధికారులు విడుదల చేశారు.
గత ప్రభుత్వానికి ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలకు సంబంధించి ప్రతి నెల రూ.700 కోట్లకుపైగా నిధులను విడుదల చేస్తామని ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. గతేడాది జూన్లో రూ.183 కోట్లు విడుదల చేసింది. ఆ తర్వాత గతేడాది ఆగస్టు నుంచి ప్రతి నెల కనీసం రూ.700 కోట్ల చొప్పున విడుదల చేస్తున్నది. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు సరెండర్ లీవుల ఎన్క్యాష్ మెంట్ పెండింగ్ మొత్తం ఒకేసారి క్లియర్ చేసింది. వాటితోపాటు విడుదలైన బిల్లుల్లో గ్రాట్యుటీ, జీపీఎఫ్, సరెండర్ లీవ్లు, అడ్వాన్సులు ఉన్నాయి.



