నవతెలంగాణ – కాటారం
కాటారం మండల కేంద్రంలోని జ్యోతిరావు పూలే బాలుర పాఠశాలను తహసీల్దార్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగది, స్టోర్ రూమ్, డైనింగ్ హాల్ను సమగ్రంగా పరిశీలించి, అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు.
తదుపరి విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడిన తహసీల్దార్, వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకొని, అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పాఠశాలలో అందిస్తున్న ఆహార నాణ్యత, ఆర్.ఓ ప్లాంట్ పనితీరు, వ్యక్తిగత పరిశుభ్రత, హాస్టల్, పాఠశాల పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు, సిబ్బందికి పలు సూచనలు చేస్తూ, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆహార నాణ్యతను మరింత మెరుగుపరచాలని ఆదేశించారు. అలాగే హాస్టల్లో పరిశుభ్రతలో ఎలాంటి లోపాలు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, తాగునీటి సరఫరా, శుభ్రత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని సూచించారు.



