రెవెన్యూ ఉద్యోగులకు మంత్రి పొంగులేటి ఆదేశం
టీజీఆర్ఎస్ఏ డైరీ ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలు, ప్రాధాన్యతలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని రెవెన్యూ ఉద్యోగులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. గతేడాది ఏ విధంగా ప్రభుత్వ ప్రాధమ్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లారో అదే విధంగా వచ్చే ఏడాదిలోనూ పనిచేయాలని సూచించారు. తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ చైర్మెన్ వి లచ్చిరెడ్డి నేతృత్వంలో డిప్యూటీ కలెక్టర్ల సంఘం, తెలంగాణ తహశీల్దార్ల సంఘం, తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ (టీజీఆర్ఎస్ఏ) నేతలు మంత్రి పొంగులేటిని సోమవారం హైదరాబాద్లో కలిశారు. ఈ సందర్భంగా టీజీఆర్ఎస్ఏ నూతన సంవత్సరం డైరీ, క్యాలెండర్ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతేడాదిలో రైతులకు భూసమస్యల పరిష్కారం కోసం భూభారతి చట్టాన్ని తెచ్చామని అన్నారు. ఈ చట్టం రాకతో రెవెన్యూ సేవలు క్షేత్రస్థాయిలోనూ అందుబాటులోకి వచ్చాయన్నారు. కేంద్రీకృతమై ఉన్న రెవెన్యూ సేవలను వీకేంద్రీకరణ చేశామని వివరించారు. గ్రామాల్లోనే రైతులకు రెవెన్యూ సేవలను అందించేందుకు గ్రామ పాలనా అధికారులు (జీపీవో)ను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఏ విధమైన భూసమస్య ఉన్నా జిల్లా స్థాయిలోనే పరిష్కారం చేసేలా చేశామని చెప్పారు.
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి : లచ్చిరెడ్డి
రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ చైర్మెన్ వి లచ్చిరెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని కోరారు. అన్ని స్థాయిలోని ఉద్యోగుల పదోన్నతులు, తహశీల్దార్ల అద్దె భవనాల పెండింగ్ బిల్లులు తదితర అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాలపై మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో టీజీఆర్ఎస్ఏ అధ్యక్ష, కార్యదర్శులు బాణాల రాంరెడ్డి, వి భిక్షం, మహిళా విభాగం అధ్యక్షురాలు సుజాత చౌహాన్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ, తెలంగాణ తహశీల్దార్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ రాములు, రమేష్ పాక, మహిళా విభాగం అధ్యక్షులు ఎం రాధ, సెక్రెటరీ జనరల్ పూల్సింగ్ చౌహాన్, టీజీటీఏ, టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర నాయకులు జయశ్రీ, రాంబాబు, మల్లేష్ పాల్గొన్నారు.



