Saturday, June 28, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంప్రతిభ ఎవరి సొత్తూ కాదు

ప్రతిభ ఎవరి సొత్తూ కాదు

- Advertisement -

వికలాంగుల హక్కుల పరిరక్షణకు ఉద్యమాలు :
ఎన్పీఆర్డీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరన్‌
సాంస్కృతిక ఉత్సవాల్లో వికలాంగులకు భాగస్వామ్యం : టీఎస్‌ఎస్‌ చైర్మెన్‌ గుమ్మడి వెన్నెల
ఘనంగా వికలాంగుల సాంస్కృతిక ఉత్సవాలు
నవతెలంగాణ – ముషీరాబాద్‌

ప్రతిభ ఎవరి సొత్తూ కాదని, సాంస్కృతిక ఉత్సవాల్లో వికలాంగులను భాగ్యస్వామ్యం చేస్తామని రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్‌పర్సన్‌ గుమ్మడి వెన్నెల తెలిపారు. శుక్రవారం హెలెన్‌ కెల్లర్‌ 145వ జయంతిని పురస్కరించుకుని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కమిటీ, హెలెన్‌ కెల్లర్‌ విద్యాసంస్థలు సంయుక్తంగా.. తెలంగాణ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ సౌజన్యంతో హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వెన్నెల మాట్లాడుతూ.. వికలాంగులు ఒంటరి వాళ్లు కాదన్నారు. వారిలో ప్రతిభ, శక్తి సామర్థ్యాలు ఉన్నాయని, వారికి సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. విద్య ద్వారానే సమాజంలో గుర్తింపు, గౌరవం వస్తుందని చెప్పారు. అంగవైకల్యం ఉందని బాధపడకుండా ముందుకు సాగాలని, రాష్ట్ర ప్రభుత్వం వారి సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. సాంస్కృతిక శాఖ ద్వారా వికలాంగులకు అవసరమైన సహాయం చేస్తామని చెప్పారు.
ఎన్‌పీఆర్‌డీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరన్‌ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వికలాంగుల హక్కులను కాలరాస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదని, పైగా వాటి వల్ల వికలాంగుల సంఖ్య పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సమానత్వం సాధించడమే వికలాంగుల ముందున్న కర్తవ్యం అని, హక్కుల పరిరక్షణకు ఉద్యమం చేస్తామని తెలిపారు.
హైదరాబాద్‌ మెట్రో పాలిటన్‌ కోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి భాషా నావాజ్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. వికలాంగులను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వలు కృషి చేయాలన్నారు. వికలాంగుల కోసం హెలెన్‌ కెల్లర్‌ విద్యాసంస్థలు చేస్తున్న కృషి ఆదర్శప్రాయమన్నారు. ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య మాట్లాడుతూ.. వికలాంగులు చదువుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. సైగల భాషను అభివృద్ధి చేయాలన్నారు. హెలెన్‌ కెల్లర్‌ విద్యా సంస్థల చైర్మెన్‌ ఉమర్‌ఖాన్‌ మాట్లాడుతూ.. మూగ, చెవిటి, అంధులు చదువుకోవడానికి విద్యాసంస్థలు లేకపోవడం వల్ల వారు ఉన్నత చదువులు చదవలేకపోతున్నారన్నారు. ఈ సందర్భంగా చదువులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 30 మంది విద్యార్థులకు రామిజా బీ మెమోరియల్‌ అవార్డ్స్‌ ప్రదానం చేశారు. హెలెన్‌ కెల్లర్‌ విద్యాసంస్థల విద్యార్థులు చేసిన సాంస్కృతిక ఉత్సవాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో టీఏఎస్‌ఎల్‌పీఏ రాష్ట్ర అధ్యక్షులు కె.నాగేందర్‌, ప్రధాన కార్యదర్శి ఇమాద్‌ ఖాన్రూమన్‌, జేఐఆర్‌డీ వెల్ఫేర్‌ ఫౌండేషన్‌ చైర్మెన్‌ డాక్టర్‌ టి.అనురాధ, ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వరమ్మ, కోశాధికారి ఆర్‌.వెంకటేష్‌, రాష్ట్ర ఆఫీస్‌ బేరర్స్‌ రాజు, స్వామి, కాషాప్ప, ఉపేందర్‌, గంగాధర్‌, యశోద, హెలెన్‌ కెల్లర్‌ విద్యాసంస్థల ప్రిన్సిపాల్‌ అర్ముగాం పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -