– ఎలక్ట్రానిక్ ఉపకరణాల కొనుగోలుకు
– రూ. 8 వేల కూపన్
– డీఎంకే మ్యానిఫెస్టో విడుదల
చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు రోజుల సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అధికార డీఎంకే ఆదివారం తన ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధ్యక్షులు ఎంకె స్టాలిన్ సీనియర్ నాయకులతో కలిసి పార్టీ ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఇందులో భాగంగా ‘ఇల్లతరసి పథకం’ను ప్రకటించారు. ఈ పథకం కింద వాషింగ్ మెషిన్, టీవీ, గ్రైండర్, ఫ్రిజ్, మిక్సి, మైక్రోవేవ్ ఓవెన్, ఇండక్షన్ స్టవ్ వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలను తమ సమీప దుకాణాల్లో కొనుగోలు చేసుకోవడానికి గృహిణులకు రూ. 8 వేల కూపన్లు ఇవ్వనున్నారు. ఆదాయపు పన్ను పరిధిలోకి రాని గృహిణులందరీకి ఈ పథకం వర్తింప చేస్తామని ప్రకటించారు. అలాగే మహిళా కుటుంబ పెద్దల కోసం ఉద్దేశించిన ‘కళైజ్ఞర్ మంగళిర్ ఉరిమై తోగై’ పథకాన్ని రూ. 1,000 నుంచి రూ. 2,000కు పెంచుతున్నట్లు ప్రకటించారు. కొత్త పథకాలు అమలు చేయడానికి ప్రభుత్వం వద్ద నిధులు ఉంటాయా అనే విలేకరుల ప్రశ్నకు స్టాలిన్ సమాధానం ఇస్తూ ‘2021 ఎన్నికల్లో కూడా ఇలాంటి సందేహాలే వ్యక్తం చేశారు. కానీ, డీఎంకే ప్రభుత్వం తన వాగ్దానాలన్నింటీని నెరవేర్చింది’ అని తెలిపారు. డీఎంకే ప్రభుత్వం అమలు చేసిన పథకాలకు దేశంలోని ఏ ఇతర రాష్ట్ర ప్రభుత్వం సాటిరాలేదని తెలిపారు. రెండంకెల వృద్ధిని సాధించిన ఏకైక రాష్ట్రం తమిళనాడు అని స్టాలిన్ తెలిపారు. అందువల్ల డీఎంకే ఏడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్టాలిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, ముఖ్యమంత్రి అల్పాహారం పథకాన్ని 8వ తరగతి విద్యార్థుల వరకూ విస్తరిస్తామని స్టాలిన్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ పథకాన్ని 1 నుంచి 5వ తరగతి విద్యార్థుల వరకే అమలు చేస్తున్నారు. అదేవిధంగా మళ్లీ డీఎంకే అధికారంలోకి వస్తే వృద్ధాప్య పింఛను పథకాన్ని రూ. 1,200 నుంచి రూ. 2,000 వరకూ పెంచనున్నారు. ఉచిత విద్యుత్ పొందుతున్న రైతులకు ఉచితంగా మీటర్ అమర్చనున్నట్లు స్టాలిన్ ప్రకటించారు. ముఖ్యమంత్రి బీమా పథకం కోసం వార్షిక వేతన పరిమితిని రూ 5 లక్షలుగా నిర్ణయించారు. ఈ పథకం బీమా మొత్తం రూ. 10 లక్షలుగా ఉంటుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు
- Advertisement -
- Advertisement -



