– సెన్సెక్స్ 700 పాయింట్లు ఫట్
– రూ.4 లక్షల కోట్ల సంపద ఆవిరి
– మదుపర్ల విలవిల
ముంబయి : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన అధిక టారిఫ్లు దలాల్ స్ట్రీట్ను బెంబేలెత్తిస్తున్నాయి. వరుసగా రెండో రోజూ మార్కెట్లను భారీ కుదుపునకు గురి చేశాయి. అమెరికా విధించిన సుంకాలు అమల్లోకి రావడానికి తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, విదేశీ మదుపర్ల అమ్మకాల కొనసాగుతుండడం తదితర పరిణామాల నేపథ్యంలో బుధవారం బీఎస్ఈ సన్సెక్స్ దాదాపు 706 పాయింట్లు పతనమై 80,080.57కు పడిపోయింది. బిఎస్ఇలో లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ దాదాపు రూ.4 లక్షల కోట్ల మేర ఆవిరై రూ.445 లక్షల కోట్లకు పరిమితమయ్యింది.
ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ సూచీ.. రోజంతా పతనంలోనే కొనసాగింది. ఇంట్రాడేలో 80,013 కనిష్టాన్ని తాకింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 211 పాయింట్ల నష్టంతో 24,501 వద్ద ముగిసింది. రెండు సెషన్లలో సెన్సెక్స్ సూచీ దాదాపు 1500 పాయింట్లు కోల్పోయింది. సెన్సెక్స్ 30లో హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, పవర్గ్రిడ్ కార్పొరేషన్, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సూచీలు అధికంగా నష్టాలు చవి చూసిన వాటిలో ఉన్నాయి. మరోవైపు టైటాన్, ఎల్అండ్టీ, మారుతీ సుజుకీ, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ షేర్లు లాభపడ్డాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడింగ్ అయ్యాయి.
ప్రధాన కారణాలు..
ఆగస్టు 27 నుంచి భారత ఎగుమతులపై అమెరికా టారిఫ్లు 50 శాతం అమలులోకి వచ్చాయి. ఇది భారత ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. దీంతో ఆయా రంగాల్లోన్ని సూచీలు భారీ నష్టాలను చవి చూశాయి. 2025లో ఇప్పటి వరకు రూ.1.6 లక్షల కోట్ల విలువ చేసే ఎఫ్ఐఐలు తరలిపోయాయి. ఆగస్టులోనే కేవలం రూ. 28,217 కోట్ల ఎఫ్ఐఐల అమ్మకాలు మార్కెట్లను ఒత్తిడికి గురి చేశాయి. జూన్ త్రైమాసికంలో కార్పొరేట్ కంపెనీల ఆదాయాలు బలహీనంగా ఉన్నాయి. దీంతో అమ్మకాలు చోటు చేసుకున్నాయని బ్రోకర్లు అభిప్రాయపడ్డారు. నిఫ్టీలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.27 శాతం, 1.45 శాతం చొప్పున నష్టపోయాయి.