ఆరోగ్యానికి జొన్నలు చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఇందులోని పోషకాలు షుగర్, బరువును తగ్గించడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, మలబద్ధకాన్ని తగ్గించడంతో సహా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అందుకే ఈ మధ్య కాలంలో వీటి వాడకం పెరిగింది. మరీ ముఖ్యంగా జొన్నలతో ఇడ్లీ, దోశ, రొట్టెలు, పొంగలి చేసుకునే వారి సంఖ్య అధికమైంది. ఇంకా వీటితో పిల్లలు ఇష్టపడేలా కూడా రకరకాల వంటలు చేసుకోవచ్చు. మరి అవేంటో మనమూ నేర్చుకుందాం…
ఉప్మా
కావాల్సిన పదార్థాలు: జొన్న రవ్వ – కప్పు, నెయ్యి – టేబుల్ స్పూను, జీడిపప్పు – టేబుల్ స్పూను, పోపు దినుసులు – అర స్పూను, ఉల్లిగడ్డ – రెండు, పచ్చిమిర్చి – రెండు, క్యారెట్ ముక్కలు – కొన్ని, కొత్తిమీర – కొద్దిగా, కరివేపాకు – ఒకరెబ్బ, ఉప్పు – రుచికి సరిపడా, పచ్చి బఠాణీలు – టేబుల్ స్పూను.
తయారీ విధానం: ముందుగా జొన్న రవ్వను శుభ్రంగా కడిన తర్వాత అందులో నీళ్లు పోసి గంటపాటు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నెయ్యి వేసి వేడయ్యాక జీడిపప్పు వేసి దోరగా వేయించి పక్కనపెట్టుకోవాలి. అదే పాన్ లోని నెయ్యిలో పోపు దినుసులు, ఉల్లిగడ్డ ముక్కలు, రెండు పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, పచ్చి బఠాణీలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో మూడు కప్పుల నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఉడికించుకోండి. నీళ్లు బాగా మరిగిన తర్వాత అందులో నానబెట్టిన జొన్నరవ్వను వేసి కలుపుకోండి. తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుతూ 10-15 నిమిషాలు ఉడికించుకోండి. అందులో ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కొంచెం కొత్తిమీర తరుగు వేసి కలుపుకోండి. అంతే వేడి వేడి జొన్నరవ్వ ఉప్మా రెడీ.
మురుకులు
కావాల్సిన పదార్థాలు: జొన్న పండి – మూడు కప్పులు, నువ్వులు – అర కప్పు, పల్లీలు – ఒక కప్పు, వాము – ఒక టేబుల్ స్పూను, వెన్న – రెండు చెంచాలు, పచ్చిమిర్చి – నాలుగు, నూనె – వేయించడానికి సరిపడినంత.
తయారీ విధానం: ముందుగా పల్లీలను వేయించి పొట్టు తీసి పొడిలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే.. పచ్చిమిర్చిని కట్ చేసుకొని పేస్ట్లా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో జొన్న పిండి, నువ్వులు, మిక్సీ పట్టుకొని పెట్టుకున్న పల్లీల పొడి, పచ్చిమిర్చి పేస్ట్, వాము, ఉప్పు, బటర్ వేసి కలుపుకోవాలి. తర్వాత తగినన్ని నీరు పోసుకుంటూ పిండిని కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. స్టౌపై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడి అయ్యేలోపు మురుకుల గొట్టంలో కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత ముందుగా కలిపిపెట్టుకున్న పిండిలో నుంచి కొద్దిగా పిండిముద్దను తీసుకొని మురుకుల గొట్టంలో తీసుకోవాలి. వేడిగా ఉన్న నూనెలో మీకు నచ్చిన ఆకారంలో పిండిని వత్తుకోవాలి. లేకపోతే.. చిల్లుల గరిటె తీసుకొని దాని మీద మీకు కావాల్సిన షేప్లో పిండిని వత్తుకొని ఆపై వాటిని కాగే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవచ్చు. మురుకులను రెండు వైపులా గోల్డెన్ కలర్లో కాల్చుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈవిధంగానే పిండి మొత్తాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. అంతే.. కరకరలాడే జొన్నపిండి మురుకులు రెడీ. ఈ మురుకులు చాలా రుచికరంగా ఉండడమే కాదు.. నూనె కూడా ఎక్కువగా పీల్చవు.
పరోటా
కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి – కప్పు, గోధుమపిండి – పావు కప్పు, మెంతి ఆకు – కప్పు, ఉప్పు- రుచికి సరిపడా, ధనియాల పొడి – టీ స్పూను, కారం – అర టీ స్పూను, పచ్చిమిర్చి పేస్టు – అర టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు – అర టీ స్పూను, జీలకర్ర పొడి – అర టీ స్పూను, పసుపు – పావు టీ స్పూను, నువ్వులు – మూడు టీ స్పూన్లు, పెరుగు – ముప్పావు కప్పు, నూనె – రెండు టీ స్పూన్లు.
తయారీ విధానం: ఓ బౌల్లోకి జొన్న పిండి, గోధుమపిండి జల్లించి తీసుకోవాలి. ఇప్పుడు అందులోకి సన్నగా తరిగిన మెంతి ఆకు, ఉప్పు, ధనియాల పొడి, కారం, పచ్చిమిర్చి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర పొడి, పసుపు, నువ్వులు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత పెరుగు, నూనె వేసి కలుపుకోవాలి. అయితే ఇక్కడ పెరుగును ఒకేసారి కలుపుకోకుండా ముందుగా కొంచెం వేసి ఆ తర్వాత మిగిలినది వేసి చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. చపాతీ పీట మీద ఓ ఉండను పొడి జొన్న పిండి చల్లుకుంటూ మరీ పల్చగా కాకుండా పరోటాలుగా వత్తుకోవాలి. అయితే పరోటాలు నీట్గా కనిపించడానికి ఏదైనా రౌండ్ షేప్ ప్లేట్తో కట్ చేసుకుంటే సరి. ఇలా అన్నింటిని చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి హీటెక్కిన తర్వాత చేసుకున్న పరోటా వేసి హై ఫ్లేమ్లో రెండు వైపులా ఓ 50 శాతం కాల్చుకోవాలి. పరోటా రెండు పక్కలా దోరగా కాలిన తర్వాత లైట్గా నెయ్యి అప్లై చేసి రెండు వైపులా కాల్చుకుని తీసుకోవాలి. అన్నింటిని ఇలానే కాల్చుకుని వేడివేడిగా తింటే రుచి చాలా బాగుంటుంది.
లడ్డూ
కావాల్సిన పదార్థాలు: పల్లీలు – కప్పు, జొన్న పిండి – కప్పు, నెయ్యి – తగినంత, జొన్న పిండి – కప్పు, బెల్లం తురుము – కప్పు, ఎండు కొబ్బరి తురుము – మూడు టీస్పూన్లు, యాలకులు – నాలుగు.
తయారీ విధానం: ముందుగా జొన్న పిండిని జల్లించి తీసుకోవాలి. అలాగే కావాల్సిన బెల్లాన్ని సన్నగా తురిమి పక్కన ఉంచాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి పల్లీలు వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ మంచి రంగు వచ్చే వరకు వేయించాలి. పల్లీలు బాగా వేగిన తర్వాత ఓ ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి కరిగించాలి. కరిగిన నెయ్యిలో జల్లించిన జొన్న పిండి వేసి లో ఫ్లేమ్లో వేయించాలి. పిండి పచ్చి వాసన పోయి లైట్గా కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఓ ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లార్చుకోవాలి. చల్లారిన జొన్న పిండిలోకి బెల్లం తురుము వేసి మిక్స్ చేసుకోవాలి. మిక్సీజార్లోకి జొన్న, బెల్లం మిశ్రమం వేసుకోవాలి. అలాగే వేయించిన పల్లీలు, ఎండు కొబ్బరి పొడి, యాలకులు వేసి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా చేసుకున్న తర్వాత కొంచెం పిండి తీసుకుని ముద్దలాగా చేయాలి. పర్ఫెక్ట్గా వస్తే పిండి రెడీ అయినట్లే. లేదంటే మరో రెండు నిమిషాలు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన పిండిని ఓ ప్లేట్లోకి తీసుకుని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు పిండిలో కొద్దికొద్దిగా నెయ్యి వేసుకుంటూ పిండిని కొంచెం తీసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని లడ్డూలుగా చుట్టుకుని గాలి చొరబడని డబ్బాలో స్టోర్ చేసుకుంటే జొన్న లడ్డూలు రెడీ.