ముంబయి : ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ 2026 ఏప్రిల్ 1 నుంచి తన ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. రూపాయి అమాంతం పతనం, ముడి సరుకుల వ్యయాలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెరిగిన ముడి సరుకుల వ్యయాలను పాక్షికంగా భర్తీ చేసేందుకు ధరలను పెంచినట్టు కంపెనీ వెల్లడించింది. పెట్రోల్ డీజిల్ వాహనాలపై సగటున 0.5 శాతం వరకు ధరలు పెరగనున్నాయి. ఇప్పటికే కమర్షియల్ వాహనాలపై 1.5 శాతం పెంపును ప్రకటించిన టాటా మోటార్స్, ఇప్పుడు కార్ల ధరలను కూడా పెంచడం సామాన్యుడికి భారంగా మారనుంది.
కేవలం టాటా మోటార్స్ మాత్రమే కాకుండా, దేశీయ ఆటోమొబైల్ రంగం మొత్తం ధరల పెంపు దిశగా అడుగులు వేస్తోందని సంకేతాలు వస్తోన్నాయి. జర్మన్ లగ్జరీ కార్ల సంస్థ ఆడి ఇప్పటికే ఏప్రిల్ నుంచి 2 శాతం పెంపును ప్రకటించగా, దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ కూడా ధరల సవరణపై సమీక్ష నిర్వహిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో లోహాల ధరలు పెరగడం, రూపాయి విలువ పతనం వంటి అంశాలు వాహన తయారీ వ్యయాలను పెంచుతున్నాయని, దీనివల్ల రాబోయే రోజుల్లో మరిన్ని కంపెనీలు ధరలను పెంచే అవకాశం ఉందని ఆటోమొబైల్ పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు.
టాటా మోటార్స్ కార్ల ధరల పెంపు
- Advertisement -
- Advertisement -



