నవతెలంగాణ – యాలాల్
యాలాల మండలంలో కోకట్ గ్రామానికి చెందిన ప్రభుత్వ హిందీ ఉపాధ్యాయుడు విద్యుత్ షాక్తో మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు,కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మహమ్మద్ ప్రస్తుతం రాస్నం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం తన నివాసంలో విద్యుత్ స్విచ్ బోర్డు, వైర్లను చెక్ చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ ఘాతానికి గురయ్యారు.
దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన తాండూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే, పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. మహమ్మద్ మృతితో ఆయన పనిచేస్తున్న రాస్నం గ్రామంలోని పాఠశాల విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఒక మంచి ఉపాధ్యాయుడిని కోల్పోయామని విచారం వ్యక్తం చేశారు. మహమ్మద్ మృతితో కోకట్ గ్రామంలోవిషాద ఛాయలు అలుముకున్నాయి.



