టెట్ మినహాయింపు కోరుతూ ఫిబ్రవరి 5న చలో ఢిల్లీ
తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని, టెట్ నుంచి మినహాయింపునివ్వాలని కోరుతూ ఫిబ్రవరి 5న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని తలపెట్టినట్టు పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు తెలిపారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్లోని పీఆర్టీయూ కార్యాలయంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో చలో ఢిల్లీ గోడ పత్రికను విడుదల చేశారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనీ, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలనీ, జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలనీ, పాఠశాలల మూసివేత, విలీనం నిలిపేసి ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలనీ, కాంట్రాక్టు, తాత్కాలిక ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలని తదితర డిమాండ్లతో జాతీయ ఉపాధ్యాయ ఫెడరేషన్లు ‘చలో ఢిల్లీ’కి పిలుపునిచ్చాయని వారు గుర్తుచేశారు. పిలుపు మేరకు ఫిబ్రవరి 5న నిర్వహించే పార్లమెంట్ మార్చ్ కార్యక్రమానికి ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు పిలుపునిచ్చారు.
ఉపాధ్యాయులందరూ ఫిబ్రవరి 5న ఉదయం 10 గంటలకు జంతర్ మంతర్ వద్దకు చేరుకోవాలని కోరారు. జంతర్ మంతర్ వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు, వివిధ జాతీయ సంఘాల నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్టీఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి చావ రవి, ఏఐఎస్టీఎఫ్ ప్రధాన కార్యదర్శి జి.సదానందం గౌడ్, పీఆర్టీయూ టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.దామోదర్ రెడ్డి, ఎస్. భిక్షం గౌడ్, టీఎస్యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్, ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్, పీటీఏటీజీ అధ్యక్షులు మల్లికార్జున రెడ్డి, టీపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్.అనిల్ కుమార్, ఎన్ తిరుపతి, డీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.సోమయ్య, టి.లింగారెడ్డి, పీటీఏపీజీ అధ్యక్షులు కె.మల్లికార్జున రెడ్డి, పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షులు మహ్మద్ అబ్దుల్లా, టీఆర్టీఎఫ్ అధ్యక్షులు కటకం రమేశ్, ఏఐఐటీఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముజీబ్, ముంతాజ్ అలీ తదితరులు పాల్గొన్నారు.



