ప్రైమరీ స్కూల్, అంగన్వాడీ కేంద్రంలో ఆకస్మిక తనిఖీ
నవతెలంగాణ – వీర్నపల్లి
విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాల ఆధారంగా పాఠ్యాంశాలు బోధించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వీర్నపల్లి మండలం వన్ పల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ సెంటర్ ను కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సెంటర్లోని తరగతి గదిలో విద్యార్థులకు వెలుతురు సక్రమంగా లేకపోవడం గమనించి, వెంటనే ట్యూబ్ లైట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అంగన్వాడి సెంటర్ వంటగది వర్షానికి నీరు కురుస్తున్నందున పాఠశాలలో అదనంగా ఖాళీగా ఉన్న గదిలోకి మార్చాలని ఆదేశించారు.
ప్రవేశాలు ఎందుకు తక్కువ ఉన్నాయి?
ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు 30 మంది విద్యార్థులు మాత్రమే ఉండడం గమనించి అడ్మిషన్లు తక్కువగా ఉండడానికి గల కారణాలు ఉపాధ్యాయులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. స్కూల్ లో గ్యాస్ కనెక్షన్ రాకపోవడం గమనించి వెంటనే గ్యాస్ కనెక్షన్ అందజేయాల్సిందిగా విద్యాధికారులను ఆదేశించారు. పాఠశాల ఆవరణలో పిచ్చి, గడ్డి మొక్కలు పెరగడం గమనించిన కలెక్టర్ వాటిని వెంటనే శుభ్రం చేయాలని పంచాయతీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు.