శాసనసభలో నిరసన తెలిపిన బీఆర్ఎస్ సభ్యులు
బడ్జెట్ బోగస్..ఆరు గ్యారంటీలు బోగస్ అంటూ నినాదాలు
వాకౌట్ చేసి బయటకెళ్లిపోయిన సభ్యులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
శాసనసభలో శుక్రవారం బడ్జెట్ పేపర్లు చింపి..చెవుల్లో పువ్వులు పెట్టుకుని బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా బోగస్ అని బీఆర్ఎస్ ఎల్పీ ఉప నేత హరీశ్రావు ఆరోపించారు. సభలో భట్టి బడ్జెట్ ప్రసంగ సమయంలో బీఆర్ఎస్ సభ్యులు గంటన్నరపాటు బాగానే కూర్చున్నారు. ముందస్తు వ్యూహం ప్రకారం ఏమోగానీ ప్రసంగం చివర్లో 1:30 ప్రాంతంలో హరీశ్రావు సైగలతో బీఆర్ఎస్ సభ్యులంతా లేచి నిలబడ్డారు. కేటీఆర్, సునీతాలక్ష్మారెడ్డి, కౌశిక్రెడ్డి, హరీశ్రావు, వివేకానంద, తదితర సభ్యులు బడ్జెట్ పుస్తకంలోకి పేపర్లను చింపి సభలో వెదజల్లారు. ముందుగానే తెచ్చుకున్న పువ్వులను చెవుల్లో పెట్టుకుని ‘ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టేలా బడ్జెట్ ఉంది’ అంటూ వ్యాఖ్యానించారు.
‘ బడ్జెట్ బోగస్..ఆరు గ్యారంటీలు బోగస్..బీసీ సబ్ప్లాన్ బోగస్..తులం బంగారం బోగస్..నాలుగువేల పింఛన్ బోగస్..నిరుద్యోగ భృతి బోగస్..’ అంటూ నినాదాలు చేస్తూ, చప్పట్లు కొడుతూ నిరసన తెలిపారు. 1:43 వరకు ఈ ఆందోళన కొనసాగింది. ఓవైపు బీఆర్ఎస్ సభ్యుల నినాదాల మధ్యనే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మరింత స్వరం పెంచి గట్టిగా చదివారు. ‘మీరూ చెవుల్లో పువ్వులు పెట్టుకోండి’ అని కాంగ్రెస్ సభ్యులను హేళన చేసినా వారు సమన్వయంతో వ్యవహరించారు. ఒక్కరు కూడా వారి ఆందోళనను పట్టించుకోలేదు. దీంతో 1:43 గంటల ప్రాంతంలో ఈ బడ్జెట్ బోగస్..వాకౌట్ చేస్తున్నాం అంటూ బీఆర్ఎస్ సభ్యులు బయటకు వెళ్లిపోయారు.
బడ్జెట్ ప్రతులు చింపి…చెవుల్లో పువ్వులు పెట్టుకుని
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



