అనువైన ప్రదేశాలను గుర్తించాలి : పుష్కర ఘాట్లు అభివృద్ధి ప్రణాళికలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గోదావరి పుష్కరాల నిర్వహణకు అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు టెక్నికల్ ఇంజనీర్ల కమిటీని నియమించాలని అధికారులను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆదివారం ముఖ్యమంత్రి.. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రధాన ఆలయాలు , పుష్కర ఘాట్ల అభివృద్ధి ప్రణాళికలపై సమీక్షించారు. 2027 జూన్లో గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేయాల్సిన పనులపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా అధికారులు పుష్కరాల నేపథ్యంలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి రూపొందించిన ప్రణాళికలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. కమిటీ క్షేత్ర స్థాయిలో పర్యటించి 15 లేదా 20 రోజుల్లోగా నివేదికను అధికారుల కమిటీకి అందజేయాలన్నారు.
ఇంజనీర్ల కమిటీ నివేదికను అధికారుల కమిటీ పరిశీలించి, పూర్తి అంచనాలతో నివేదికను క్యాబినెట్ సబ్ కమిటీకి పంపాలని తెలిపారు. క్యాబినెట్ సబ్ కమిటీ ఆమోదం తరువాత ప్రణాళికలకు సంబంధించిన నివేదికపై క్యాబినెట్ తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. శాశ్వత, తాత్కాలిక పనులను ప్రాధాన్యతల వారీగా పూర్తి చేసేలా ప్రణాళికలు ఉండాలని నిర్దేశించారు. వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపం తలెత్తకుండా ప్రజా భవన్లో ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా ప్రధాన దేవాలయాలు, పర్యాటక ప్రదేశాల్లో ఘాట్ల విస్తరణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లు, వివిధ ప్రాంతాల మధ్య కనెక్టివిటీ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అభివృద్ధి, ఆలయ విస్తరణకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. మాస్టర్ ప్లాన్పై వారికి సీఎం పలు సూచనలు చేశారు.



