Sunday, June 29, 2025
E-PAPER
Homeజిల్లాలుతేజస్వి యాదవ్ కు త్రుటిలో త‌ప్పిన‌ పెను ప్రమాదం

తేజస్వి యాదవ్ కు త్రుటిలో త‌ప్పిన‌ పెను ప్రమాదం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బీహార్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నాయకుడు తేజస్వి యాదవ్ త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. మాధేపురా నుంచి పాట్నాకు తిరిగి వస్తుండగా ఆయన కాన్వాయ్‌ ఈ తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో తేజస్వి యాదవ్ సురక్షితంగా బయటపడినప్పటికీ, ఆయన భద్రతా బృందంలోని ముగ్గురు సభ్యులు గాయపడ్డారు. ఈ తెల్లవారుజామున సుమారు 1:30 గంటల సమయంలో వైశాలి జిల్లాలోని గోరౌల్ టోల్ ప్లాజా సమీపంలో జాతీయ రహదారి-22పై ఈ ప్రమాదం జరిగింది. తేజస్వి యాదవ్, ఆయన సిబ్బంది టీ తాగేందుకు రోడ్డు పక్కన ఒక హోటల్ వద్ద ఆగారు. ఆ సమయంలో వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఒక ట్రక్కు అదుపుతప్పి కాన్వాయ్‌లోని ఒక వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో అక్కడ ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.

ప్రమాదం జరిగినప్పుడు తేజస్వి యాదవ్ ధ్వంసమైన వాహనానికి కేవలం ఐదు అడుగుల దూరంలోనే ఉన్నారని, అందువల్ల ఆయనకు ఎలాంటి అపాయం జరగలేదని తెలిసింది. “ఆ వాహనం కొంచెం ముందుకు కదిలి ఉన్నా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది” అని తేజస్వి యాదవ్ స్వయంగా విలేకరులతో అన్నారు. ఈ ఘటన ‘చాలా తీవ్రమైనది, ఆందోళన కలిగించేది’ అని ఆయన అభివర్ణించారు. ప్రజాప్రతినిధుల భద్రతా వ్యవస్థను తక్షణమే సమీక్షించాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా నొక్కిచెప్పారు. ఈ దుర్ఘటనలో గాయపడిన ముగ్గురు భద్రతా సిబ్బందిని వెంటనే సమీపంలోని సదర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఒకరికి తలపై గాయమైందని, ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని సమాచారం. అయితే, ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న సారాయ్ పోలీస్ స్టేషన్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కును గోరౌల్ టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డగించి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు అధికారికంగా దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -